Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనం రూ.18వేలు చెల్లించాలి : కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్
- గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్కు వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను కొనసాగించి ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జెడ్ చోంగ్తును సోమవారం హైదరాబాద్లో ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జె వెంకటేష్, ఉపాధ్యక్షులు పాలడుగు భాస్కర్ కలిసి వినతిపత్రం సమర్పించారు. తొమ్మిదేండ్లుగా ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలుగా పనిచేస్తున్నారని తెలిపారు. స్థానికంగా ఉంటూ వైద్యసేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. 24గంటలపాటు అందు బాటులో ఉన్నా 4వేల వేతనం చెల్లిస్తున్నారని తెలిపారు. ఈఎస్ఐ, పీఎఫ్ వంటి చట్టబద్ధ సౌకర్యాల్లేవని పేర్కొన్నారు. కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఐటీడీఏ ద్వారా కొనసాగించాలని కోరారు. వసతి గృహంలో ప్రత్యేకంగా నివాసం ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రసూతి, వారాంతపు సెలవులు ఇవ్వాలని పేర్కొన్నారు. మెడికల్ కిట్లు ఇవ్వాలని తెలిపారు. ట్రస్టు కాకుండా నేరుగా ఐటీడీఏ ద్వారానే వేతనాలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలిపారు. గుర్తింపు కార్డులు, యూనిఫాం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.