Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మ్యానువల్ పద్ధతికి స్వస్తి
- విద్యార్థులు స్కూల్ మారినా ఆన్లైన్లోనే
- పాఠశాల విద్యాశాఖ నిర్ణయం
- ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు
- ప్రయివేటు బడులకూ వర్తింపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పాఠశాల విద్యావ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరుగుతున్నది. ఇంతకాలం విద్యార్థులకు బదిలీ సర్టిఫికెట్ (టీసీ) మ్యానువల్ పద్థతిలో ఇచ్చేది. ఒకటో తరగతిలో చేరిన విద్యార్థి పాఠశాల మారినప్పుడల్లా ఓ టీసీ జారీ అవుతుంది. అంటే ఎన్ని పాఠశాలలు మారితే అన్ని టీసీలు ఉంటాయి. అయితే మ్యానువల్ టీసీ పద్థతికి పాఠశాల విద్యాశాఖ స్వస్తి పలికింది. ఇక నుంచి డిజిటల్ టీసీ అందుబాటులోకి రానుంది. ఈ కొత్త విధానం ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రయివేటు బడుల్లోని విద్యార్థులకూ వర్తింపచేయనుంది. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలన్నింటినీ డిజిటలీకరణ చేయనున్నారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థుల వరకు డిజిటల్ పద్ధతిలో టీసీలను రూపొందిస్తున్నారు. అడ్మిషన్ నెంబర్ ఆధారంగా ఆధార్ నెంబర్తో అనుసంధానం చేసి డిజిటల్ టీసీని తయారు చేస్తారు. ఇక విద్యార్థి పాఠశాల మారినప్పుడల్లా టీసీ జారీ కాదు. డిజిటల్ టీసీ అయినందున ఏ పాఠశాల మారితే ఆ పాఠశాలకు ఆన్లైన్లోనే టీసీ జారీ అవుతుంది. అంటే విద్యార్థి ఒక పాఠశాల నుంచి ఇంకో పాఠశాలలో చేరితే అడ్మిషన్ నెంబర్ ఆధారంగా సమాచారం పాఠశాల విద్యాశాఖకు చేరుతుంది. ఆ విద్యార్థి డిజిటల్ టీసీని చేరిన పాఠశాలకు అధికారులు నేరుగా పంపిస్తారు. మ్యానువల్ పద్ధతిలో టీసీ ఉంటే విద్యార్థులకు అనేక ఇబ్బందులుండేవి. టీసీ ఉంటేనే ఇంకో పాఠశాలలో ప్రవేశం ఉండేది. లేనిపక్షంలో ప్రవేశం ఉండదు. టీసీ కోసం విద్యార్థులు రోజుల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. ఇక ఆ బాధలు విద్యార్థులకుండవు. విద్యార్థులు నచ్చిన వేరే పాఠశాలలో చేరినా టీసీ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. టీసీ ఆన్లైన్లోనే జారీ అవుతున్నందున విద్యార్థులకు ఇక తిప్పలుండవు.
కంప్యూటర్లు లేని పాఠశాలలకు ఇబ్బంది...
రాష్ట్రంలో 2017-18 విద్యాసంవత్సరంలో 40,841 పాఠశాలల్లో 58,50,440 మంది చదివారు. ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల్లో కంప్యూటర్లు అందుబాటులో ఉంటాయి. ఇక ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి కొంత ఇబ్బంది కరంగా ఉంటుంది. అందులోనూ ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ల కొరత లేదు. ఎందుకంటే గతంలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఐసీటీ) పథకం అమలైంది. దీంతో ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ టీసీలు జారీ చేసేందుకు అవకాశముంటుంది. అయితే కంప్యూటర్ల సౌకర్యం లేని పాఠశాలలకు ఇబ్బంది తప్పదు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కంప్యూటర్లు అందుబాటులో లేవు. దీంతో ఆ పాఠశాలల్లో చదివే విద్యార్థులు మరో పాఠశాలలో చేరాలంటే డిజిటల్ టీసీ జారీ చేసేందుకు ఆటంకాలు ఏర్పడతాయి. ఈ సమస్యను ఎలా అధిగమిస్తారన్నది ప్రభుత్వం ముందు సవాల్గా ఉన్నది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఆన్లైన్లోనే కంప్యూటర్ ద్వారా టీసీలు చేరిన పాఠశాలకు వెళ్తాయి. అయితే పదో తరగతి విద్యార్థులు జూనియర్ కాలేజీల్లో చేరాల్సి ఉన్నందున వారికి డిజిటల్ టీసీలే జారీ చేసినా మ్యానువల్ పద్ధతిలో ఇస్తారు. ఒకవేళ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు జూనియర్ కాలేజీలు పాఠశాల విద్యాశాఖతో అనుసంధానం చేసుకుంటే డిజిటల్ టీసీ విధానం వారికీ వర్తింప చేసేందుకు అవకాశముంటుంది. డిజిటల్ టీసీ విధానం వల్ల దొంగ టీసీలు జారీ చేసేందుకు వీలుండదు. రెండుమూడు టీసీలు సృష్టించే పద్ధతికి అవకాశముండదు.
కంప్యూటర్లు ఇచ్చేందుకు కృషి చేస్తాం : విజరుకుమార్
ప్రాథమిక పాఠశాలల్లో కంప్యూటర్లు ఇచ్చేందుకు కృషి చేస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి విజరుకుమార్ తనను కలిసిన విలేకరులతో చెప్పారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ కంప్యూటర్లు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. డిజిటల్ టీసీ విధానం వల్ల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ప్రధానోపాధ్యాయులకూ ఈ విధానం సులువుగా ఉంటుందన్నారు. ఆలస్యం కాకుండా వేగంగా ఈ ప్రక్రియ ఉంటుందని అన్నారు.