Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చప్పుడు చేయకుండా పోయి చదువుకోరి
- కేసులు పెడితే అక్కరకు రాకుండా పోతరు?
- జేపీఎస్ అభ్యర్థులతో పీఆర్ శాఖ డిప్యూటీ కమిషనర్ వ్యాఖ్యలు
- వినతిపత్రం ఇచ్చే సమయంలో ఫొటోలు తీసేందుకూ మీడియాకు నిరాకరణ
- సచివాలయ ముట్టడికి జేపీఎస్ అభ్యర్థుల యత్నం
- అడ్డుకున్న పోలీసులు, అరెస్టు
- వెయ్యి దాకా వినతిపత్రాలిచ్చాం..సీఎం సార్ దృష్టికి పోయిందో?లేదో?
- 1:3 నిష్పత్తిలో మమ్ముల్ని పిలవాలి : జేపీఎస్ అభ్యర్థులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మిగిలిన ఖాళీలను మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని కోరుతూ జూనియర్ పంచాయతీరాజ్ కార్యదర్శి పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారులకు హైదరాబాద్లో సోమవారం మొరపెట్టుకునేందుకు వస్తే చేదు అనుభవం ఎదురైంది. ''ఏం మీడియాను పట్టుకుని వచ్చారు? బెదిరిస్తున్నరా? రోజూ ఆఫీసులు పట్టుకుని తిరిగితే ఉద్యోగాలొస్తయా? గ్రూపులు కడ్తున్నరా? కేసులు పెడ్తే అక్కరకు రాకుండా పోతరు? పోయి వేరే జాబులకు ప్రిపేర్కండి. సీఎంకు చెప్పినం. ఆయన ఏం నిర్ణయం తీసుకుంటే దానిని అమలు చేస్తం. మీరు ఏమైనా అడ్మినిస్ట్రేషన్ వారా? చెబితే విననీకి. సమస్య ఉంటే చప్పుడుకాకుండా వచ్చి వినతిపత్రం ఇచ్చిపోరి'' అంటూ పంచాయతీ రాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సుధాకర్ దురుసుగా వ్యాఖ్యానించారు. వినతిపత్రం ఇచ్చే సమయంలో ఫొటోలు తీసేందుకు కూడా ఫొటో జర్నలిస్టులకు అనుమతివ్వలేదు. తీవ్ర మనోవేదనకు గురైన జేపీఎస్ అభ్యర్థులు సచివాలయాన్ని ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. పోలీసులు 50 మందిదాకా అభ్యర్థులను అరెస్టు చేసి గోపాల్రావుపేట పోలీస్స్టేషన్కు తరలించారు. సాయంత్రం వరకు స్టేషన్లో ఉంచుకుని వదిలిపెట్టారు.
సచివాలయం, పంచాయతీరాజ్ శాఖ కార్యాలయం ఎదుట జరిగిన కార్యక్రమాలను ఉద్దేశించి జూనియర్ పంచాయతీ రాజ్ కార్యదర్శి పరీక్ష రాసిన అభ్యర్థులు మాట్లాడుతూ..జేపీఎస్ నియామకాల్లో 1:1 నిష్పత్తిలో పిలవటం వల్ల దారుణంగా నష్టపోయామని, 1:3 నిష్పత్తిలో మళ్లీ పిలిచి న్యాయం చేయాలని కోరారు. తామంతా మార్కులు సమానంగా వచ్చి పుట్టిన తేదీ తక్కువగా ఉండటంతో, 0.25 మార్కులతో జాబ్ కోల్పోయిన వారమేనని ఆవేదన వ్యక్తం చేశారు. 1:1 నిష్పత్తిలో పిలవటం వల్ల అప్పటికే పలు ఉద్యోగాలు వచ్చి జాయిన్ కాకుండా ఉన్నవారు 1200 మంది దాకా ఉన్నారని, దాదాపు 2 వేల పోస్టులు మిగిలాయని, వాటిని వెంటనే తమతో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 124 జీవోను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామానికో పంచాయతీ రాజ్ కార్యదర్శి ఉండేలా చూడాలని సీఎం కేసీఆర్ను కోరారు.
వెయ్యి దాకా వినతులిచ్చాం..సీఎం దృష్టికి పోతుందా? లేదా? : జేపీఎస్ అభ్యర్థులు
''పెండ్లీలు చేసుకోకుండా..పనిచేయకుండా ఏం జేస్తరు? అని చుట్టాలు, ఇంటోళ్లు మొత్తుకుంటున్నా పట్టించుకోకుండా కష్టపడి చదివినం. న్యాయం కోసం జిల్లా, రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యాలయాల్లో వెయ్యిదాకా వినతిపత్రాలిచ్చాం. మాకు ఏదో ఒక హామీ ఇస్తే ఈ లొల్లే ఉండదు. రోజు తిప్పుంచుకుంటున్నరం. ఏదైనా బాండ్ రాసి ప్రయివేటు జాబ్ల చేరితే..మళ్ల ఎక్కడ పిలుస్తరో అన్న భయం వేస్తున్నది. ఖాళీగా ఉంటున్నం. మా ఇండ్లళ్ల భారమైనం. నిరుద్యోగుల పట్ల అధికారుల తీరు దారుణం. చదువుకోవడం మాకు తెలియదా? ఐదారుగురిని లోపలికి పంపితే మా వెంట పోలీసోళ్లు వచ్చిర్రు. మేం ఏమన్న అధికారులను కొడుతమా? చంపుతమా?. మాది గాంధేయ పోరాటం. జిల్లాల్లో, రాష్ట్ర కార్యాలయాల్లో ఇప్పటిదాకా వెయ్యిదాకా వినతిపత్రాలిచ్చాం. ఏమైనా గొడవ చేసినమా? అవి సీఎం సారు దగ్గరకు పోతున్నయో? లేదో అర్థం అయితలేదు? కొట్లాడి సాధించుకున్న తెలంగాణ గిందుకేనా? కేసీఆర్ సార్ జర మాపై దయ చూపి ఉద్యోగాలిప్పిస్తే మా కుటుంబాలు నిలబడతయి. లేకపోతే ఆగమైతయి'' అంటూ పలువురు జేపీఎస్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాలకు జేపీఎస్ అభ్యర్థులు ఎస్. ఈశ్వర్, మురళి, అనిల్, మమత, శిరీష, నాగరాజు, నారాయణమూర్తి, మారుతి, అనిల్, రమేష్లతో పాటు మరో 80 మంది దాకా పాల్గొన్నారు.