Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మతతత్వ, మూఢత్వ భావజాలంపై సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, కోట రమేష్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర శిక్షణా తరగతుల్లో ఆలిండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ జాతీయ ఉపాధ్యక్షులు తాటి రమేష్, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవి ప్రసంగించారని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక విద్యారంగంలోకి మతతత్వ, అశాస్త్రీయ భావజాలాన్ని వేగంగా తీసుకొచ్చిందని తెలిపారు. శాస్త్రీయ, లౌకిక భావాలను ధ్వంసం చేసేందుకు కుట్ర పన్నుతోందని పేర్కొన్నారు. మతాన్ని రాజకీయాలకు వాడుకుంటూ ప్రజల సెంటిమెంట్తో ఉన్మాదం సృష్టించి రాజకీయ లబ్ది పొందుతోందని తెలిపారు. విద్యారంగాన్ని కాషాయీకరణ చేసి శాస్త్రీయ విద్యావిధానం స్థానంలో అశాస్త్రీయ భావజాలాన్ని తీసుకొచ్చి తిరోగమన విధానాలను అవలంబిస్తోందని పేర్కొన్నారు. సమాజ గమనాన్ని తెలిపే సామాజిక శాస్త్రాల పాఠ్యాంశాలను తొలగించి జ్యోతిష్యం, వాస్తు, యోగా వంటి మతపరమైన వాటిని చొప్పించే ప్రయత్నం వేగంగా సాగుతోందని తెలిపారు. మతతత్వ, మూఢత్వ భావాజాలాన్ని వ్యతిరేకించాలని పేర్కొన్నారు. అశాస్త్రీయమైన విద్యా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేపడతామని తెలిపారు.