Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు డీజీ జితేందర్
నవ తెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుళ్లకు వారాంతపు సెలవు అంశాన్ని చర్చిస్తున్నామని రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ జితేందర్ అన్నారు. అయితే ఇందుకు కొంత సమయం పడుతుందని మంగళవారం 'నవతెలంగాణ'తో మాట్లాడుతూ తెలిపారు. పక్క రాష్ట్రం ఏపీలో పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవులిస్తూ ఆదేశాలు జారీ అయిన నేపథ్యంలో తెలంగాణలోనూ ధీర్ఘకాలంగా ఈసౌకర్యం కోసం పోలీసులు ఎదురుచూస్తున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా తాము కూడా సానుభూతితోనే ఈ సమస్యపై దృష్టిని కేంద్రీకరించామని అన్నారు. అయితే సిబ్బంది కొరత, మరికొన్ని సాంకేతిక కారణాలతో కొంత జాప్యం జరుగుతున్నదని ఆయన అన్నారు. త్వరలోనే రిక్రూట్ అయిన వారు రాష్ట్ర పోలీసుశాఖ విధుల్లో చేరుతున్నారని, దానితో చాలా వరకు సిబ్బంది కొరత తీరే అవకాశాలు ఉన్నాయన్నారు. కొన్ని జిల్లాల్లో ఎస్పీ స్థాయి అధికారులు వారాంతపు సెలవులు తమ వెసులుబాటుకు అనుగుణంగా అనుమతిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సమస్యపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని జితేందర్ అన్నారు. డీఎస్పీ మొదలుకుని నాన్ కేడర్ ఎస్పీల వరకు ఇరు రాష్ట్రాలకు విభజన జరగాల్సి ఉందని ఆ దిశగా కొంత పురోగతిని సాధించామని ఆయన అన్నారు. త్వరలోనే ఈ సమస్యపైనా ఇరు రాష్ట్రాల డీజీపీలు తగిన నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు.