Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కారు వైఖరిపై టీఎస్యూటీఎఫ్ నిరసన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉద్యోగులను మంత్రివర్గ సమావేశం నిరాశకు గురిచేసిందని టీఎస్యూటీఎఫ్ ప్రకటించింది. మంత్రివర్గం ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటిస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూశామని టీఎస్యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్ రాములు, చావ రవి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సీపీఎస్ రద్దు, ఉద్యోగ విరమణ వయస్సు 61 ఏండ్లకు పెంపు వంటి నిర్ణయాలపై ఆశాభంగం ఎదురైందని పేర్కొన్నారు. గతేడాది జూన్ 2న ఐఆర్ ప్రకటిస్తామని చెప్పిన సీఎం ఈ ఏడాది జూన్ 2 వెళ్లిపోయినా మాట నిలబెట్టుకోలేదని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఉద్యోగ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచుతామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఏపీలో నూతన ప్రభుత్వం సీపీఎస్ రద్దుకు నిర్ణయం తీసుకుందని తెలిపారు. వరుస ఎన్నికలతో ఆర్నెల్లుగా వేచిఉన్న ఉద్యోగులు ఈ మంత్రివర్గ సమావేశంపై భారీ ఆశలు పెట్టుకున్నారని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నిర్ణయిస్తామంటూ దాటవేయడం సమంజసం కాదని తెలిపారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఉద్యోగులకు ఉన్న భ్రమలు తొలగిపోతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల పక్షం వహించే సంఘాల నాయకులు ఏకతాటిపైకి వచ్చి ఐక్య ఉద్యమ కార్యాచరణను ప్రకటించాలని పేర్కొన్నారు.
ఉద్యోగులను అవమానించడమే : టీఎస్టీయూ
రాష్ట్ర మంత్రివర్గం మధ్యంతర భృతి (ఐఆర్), ఉద్యోగ విరమణ వయస్సు 61 ఏండ్లకు పెంచకపోవడాన్ని టీఎస్టీయూ తీవ్రంగా ఖండించింది. ఇది ఉద్యోగుల వర్గాన్ని అవమానించడమేనని టీఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అబ్దుల్లా, రాజిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.