Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి
నవతెలంగాణ-భువనగిరి
అంగన్వాడీలకు పెంచిన వేతనాలు అమలు చేయాలని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం యాదాద్రి భువనగిరి జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు ఎదుట అంగన్వాడీ టీచర్లు మంగళవారం చేపట్టిన రిలే నిరాహార దీక్షలను జయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎనిమిది నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు.అంగన్వాడీ కార్యకర్తలే రేషన్ షాపులకు వెళ్లి బియ్యాన్ని తెచ్చుకోవాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. రేషన్ డీలర్లే సెంటర్లకు బియ్యాన్ని సరఫరా చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన 12 జాతీయ సెలవులను వెంటనే పునరుద్ధరణ చేయాలన్నారు. వివిధ ప్రభుత్వ పథకాలు, జెండా ఆవిష్కరణ సందర్భంగా అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించాలన్నారు. జీఓ 19ని సవరించి గ్రాడ్యుటీని పెంచి పెన్షన్ నిర్ణయించాలన్నారు. ఆయాలకు వేతనం పెంచి ప్రమోషన్ల సౌకర్యం కల్పించాలన్నారు. మినీ టీచర్స్ను మెయిన్ టీచర్స్గా గుర్తించి ఆయాలను నియమించాలని కోరారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఐసీడీఎస్ను సంస్థాగతం చేసి నగదు బదిలీ, పోస్టాఫీస్ల ద్వారా ఆహార సరఫరా చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలపై అధికారుల, రాజకీయ నాయకుల వేధింపులు అరికట్టాలన్నారు. ఏడు జతల యూనిఫామ్స్, ఐదు సంవత్సరాల స్టేషనరీ డబ్బులు, ఇన్చార్జి అలవెన్స్లు, నాలుగు సంవత్సరాల ఇంక్రిమెంట్ డబ్బులు వెంటనే అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి సిలువేరు రమాకుమారి, రుక్మిణి, సరిత, షాహిద, శ్యామల, కళమ్మ, శారద తదితరులు పాల్గొన్నారు.