Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరేండ్లలో ఎన్నడూ హాజరుకాని సీఎం కేసీఆర్
- విద్యాసంవత్సరం ప్రారంభమైనా సమీక్షలేదు
- పత్తాలేని విద్యామంత్రి జగదీశ్రెడ్డి
- చేతులెత్తేసిన ఉన్నతాధికారులు
- డీఈవో, ఎంఈవోలు, ఉపాధ్యాయులదే బాధ్యత
- విద్యారంగంపై టీఆర్ఎస్ సర్కారు వివక్ష
- ప్రభుత్వ పాఠశాలలు మరింత పతనం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టాల్సిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం మొక్కుబడిగా సాగుతున్నది. ప్రభుత్వ ఆదరణ లేక తూతూమంత్రంగా నడుస్తున్నది. ఒకవైపు సరిపోను నిధుల్లేక ఇంకోవైపు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సర్కారు బడులు కునారిల్లుతున్నాయి. 2014, జూన్ 2న తెలంగాణ ఆవిర్భవించడంతోపాటు అదేరోజు ముఖ్యమంత్రిగా కె చంద్రశేఖర్రావు ప్రమాణస్వీకారం చేశారు. 2014-15 విద్యాసంవత్సరం 2014, జూన్ 12న ప్రారంభమైంది. తొలిఏడాది ప్రారంభమైన విద్యాసంవత్సరంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొనలేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకూ ఆరు విద్యాసంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ ఆరేండ్లలో ఎన్నడూ సీఎం కేసీఆర్ బడిబాటలో పాల్గొనలేదంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గత ముఖ్యమంత్రులు బడిబాట ప్రారంభోత్సవ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనేవారు. ఏపీలో ఇటీవల అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిగూడెంలో అధికారికంగా రాజన్న బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం విదితమే. బడిబాట కార్యక్రమం ద్వారా విద్యారంగం పట్ల ప్రభుత్వానికి ఉన్న విజన్ను, ప్రణాళికను వివరించాలి. కానీ సీఎం కేసీఆర్ ఆరేండ్లలో ఒక్కసారీ బడిబాటలో పాల్గొనలేదంటే విద్యారంగంపై ఎంత చిత్తశుద్ధి ఉన్నదో దీన్ని బట్టి అర్థమవుతున్నది. విద్యాశాఖ మంత్రి జి జగదీశ్రెడ్డి సైతం పత్తాలేకుండా పోయారు. ఈనెల 14న బడిబాట కార్యక్రమం ప్రారంభమైంది. ఇంత వరకూ సీఎం కేసీఆర్, విద్యామంత్రి జగదీశ్రెడ్డి ఎక్కడా పాల్గొనలేదు. ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమం పట్ల ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. ఇక విద్యాశాఖ ఉన్నతాధికారులూ చేతులెత్తేశారు. విద్యాశాఖ కార్యదర్శి బి జనార్దన్రెడ్డి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి విజరుకుమార్లు కూడా అధికారికంగా హాజరుకాలేదు. జిల్లా విద్యాశాఖాధికారులు (డీఈవో), మండల విద్యాశాఖాధికారులు (ఎంఈవో), పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులే బాధ్యతగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగం పట్ల ఎంత వివక్ష ప్రదర్శిస్తున్నదో బడిబాటను పట్టించుకోకపోవడమే నిదర్శనం.
పాఠశాలల్లో పండగ వాతావరణం ఉండాలి
ప్రతిఏటా ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు పాఠశాలలకు వేసవి సెలవులుంటాయి. జూన్ 12న పాఠశాలలు పున:ప్రారంభమవుతాయి. వేసవి సెలవుల్లో పాఠశాలల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడం, మౌలిక వసతులను కల్పించడం, జూన్ 12 నాటికి సర్వంసిద్ధం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠ శాలల భవనాలకు రంగులు వేయాలి. సర్కారు బడుల్లో ఉపాధ్యాయ ఖాళీ పోస్టు లను భర్తీ చేయాలి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోవడం లేదు. ఇంకోవైపు బడిబాట కార్యక్రమం నిర్వహించే నాటికి ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థు లు, తల్లిదండ్రులను ఆకర్షించేలా అందంగా తీర్చిదిద్దాలి. బడిబాట అంటేనే ప్రభు త్వ పాఠశాలల్లో పండగ వాతావరణం ఉండాలి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం బడిబా టను నామమాత్రంగా నిర్వహిస్తున్నది. సర్కారు బడుల్లో చేరాలనేకునే విద్యార్థులే వస్తున్నారు. బడిబాట సందర్భంగా కొత్త విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆకర్షించకపోవడం గమనార్హం. బడిబాట నిర్వహణ పట్ల అధికారులే పెదవివిరుస్తున్నారు. దీని నిర్వహణకు ప్రభుత్వం ఒక్కో పాఠశాలకు రూ.వెయ్యి కేటాయించింది. బ్యానర్లు, కరపత్రాలు, ఫ్లెక్సీలు రూపొందించి ఆవాస ప్రాంతాల్లో ప్రచారం చేపట్టాలి. సరిపోను నిధుల్లేక బడిబాట మొక్కుబడిగా సాగుతున్నది. సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో బడిబాట విద్యార్థులు, తల్లిదండ్రుల విశ్వాసాన్ని పొందలేకపోతున్నది.
సర్కారు బడుల్లో సమస్యల తిష్ట
రాష్ట్రంలో 26,040 పాఠశాలలున్నాయి. వాటిలో 21,50,626 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 1,07,259 మంది అర్హులైన ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఉపాధ్యాయ ఖాళీల్లో ప్రభుత్వం విద్యావాలంటీర్లను నియమిస్తున్నది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు తిష్టవేశాయి. 2017, అక్టోబర్లో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) ద్వారా 8,792 ఉపాధ్యాయ పోస్టులను ప్రకటించింది. రాతపరీక్ష జరిగినా నియామక ఉత్తర్వులు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇక ఏకీకృత సర్వీసు నిబంధనల్లేక దశాబ్ధాలుగా ఎంఈవో, డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్ వంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో 539 ఎంఈవో పోస్టులకుగాను 515 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే రెగ్యులర్ ఎంఈవోలు 24 మందే పనిచేస్తున్నారు. మిగిలిన 515 ఖాళీల్లో ఇన్చార్జీలు విధులు నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం, ప్రీ ప్రైమరీ తరగతులను కోరుకుంటున్నారు. ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు, తెలుగు మీడియంతో సమాంతరంగా ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తామని ప్రకటించలేదు. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు ఏటా రెండు జతల ఉచిత బట్టలు ఇస్తారు. అయితే 14 జిల్లాలకే యూనిఫామ్లకు సంబంధించిన బట్ట వెళ్లింది. నిధుల కొరత కారణంగా 19 జిల్లాలకు బట్ట వెళ్లలేదు. ఇంకోవైపు ఉచిత పాఠ్యపుస్తకాలు జిల్లా, మండల కేంద్రాలకు వెళ్లాయి. ఇంకా సగం పాఠశాలలకు పుస్తకాలు వెళ్లలేదు. ఇక విద్యారంగానికి అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయించడం లేదు. 2019-20 ఓటాన్ అకౌంట్ మొత్తం బడ్జెట్ రూ.1,82,017 కోట్లు ప్రతిపాదించింది. ఇందులో విద్యారంగానికి రూ.12,220 (6.71 శాతం) కోట్లు కేటాయించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో విద్యారంగానికి 10.88 శాతం నిధులు కేటాయించింది. 2014-15తో పోల్చితే 2019-20 లో 4.17 శాతం నిధులు విద్యారంగానికి తగ్గించడం పట్ల విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. ప్రభుత్వ విద్యారంగాన్ని టీఆర్ఎస్ సర్కారు కావాలనే నిర్లక్ష్యం చేస్తోందని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి.
1.73 లక్షల మంది చేరిక
బడిబాట కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,73,378 మం ది విద్యార్థులు చేరారు. ఈనెల 14న జయశంకర్ బడిబాట కార్యక్రమం ప్రారం భమైన విషయం తెలిసిందే. తొలిరోజు 65,149 మంది, రెండో రోజు 60,402 మంది, మూడో రోజు 60 మంది, నాలుగో రోజు 47,767 చొప్పున మొత్తం 1,73,378 మంది ప్రవేశం పొందారు. బడిబాట కార్యక్రమం బుధవారంతో ముగి యనుంది. చివరిరోజు ఎంత మంది విద్యార్థులు చేరుతారో వేచిచూడాల్సిందే.
కార్పొరేట్ విద్యను ప్రోత్సహించేందుకే :ఎ నర్సిరెడ్డి, ఎమ్మెల్సీ
ప్రభుత్వ విద్యారంగాన్ని బలహీనం చేసి కార్పొరేట్ విద్యారంగాన్ని ప్రోత్సహించేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని మొక్కుబడిగా నిర్వహిస్తున్నది. ఎక్కడా సీఎం, విద్యామంత్రి, ఇతర మంత్రులు, అధికారులు పాల్గొనలేదు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలన్న సంకల్పం ప్రభుత్వానికి లేదు. ఐదు రోజులపాటు బడిబాట నిర్వహించాలని విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు మాత్రమే ఇచ్చారు. తూతూమంత్రంగా సాగుతున్నది. ప్రభుత్వం చొరవ తీసుకొని సర్కారు విద్యారంగాన్ని బలోపేతం చేయాలి. లేదంటే ప్రభుత్వ విద్యారంగాన్ని పరిక్షించడం కోసం ప్రజా ఉద్యమం రావాలి.
తూతూమంత్రంగా బడిబాట : చావ రవి, టీఎస్యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి
ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని తూతూమంత్రంగా నిర్వహిస్తున్నది. బడిబాట అంటే ప్రభుత్వ పాఠశాలల్లో పండగ వాతావరణం ఉండాలి. కొత్త పిల్లలను ఆకర్షించేందుకు అందంగా అలంకరించాలి. కానీ విద్యాశాఖ అధికారులు అలా తీర్చిదిద్దలేదు. బడిబాట కార్యక్రమం ప్రకటించారు. ఇందులో డీఈవోల స్థాయి వరకే బాధ్యత ఉన్నది. ఉన్నతాధికారుల భాగస్వామ్యం లేదు. ఈ బడిబాట కార్యక్రమం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు.