Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్డుకున్న కుటుంబీకులు, స్థానికులు
- తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన
నవతెలంగాణ-ఊర్కొండ
తమ భూమి తమకు ఇవ్వాలని రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలో మంగళవారం జరిగింది. కుటుంబీకులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకుర్తి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన రైతులు నాప కిష్టయ్య, ఆయన కుమారుడు నాప జంగయ్య, మనుమలు శ్రీశైలం, బీరయ్య, లక్ష్మయ్య మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఎంతసేపైనా అధికారులు స్పందించకపోవడంతో రైతు కట్ట బాల్ జంగయ్య ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు అగ్గిపెట్టు లాక్కున్నారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. 60ఏండ్ల కింద ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట శివారులోగల సర్వేనెంబర్లు 194, 195లో గల ఐదెకరాల 12గుంటల భూమిని వీరెడ్డి రాంరెడ్డి దగ్గర తాము కొనుగోలు చేశామన్నారు. ఆ భూమిని అప్పటి నుంచి సాగుచేసుకుని జీవనం సాగిస్తున్నామని చెప్పారు. తమ పేర పట్టా కాలేదని, మూడు నెలల కింద తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని చెప్పారు. కానీ, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, ఆర్ఐలు మురళీ, కరుణాకర్ గ్రామానికి వచ్చి సరైన విచారణ చేయకుండా తమకు భూమి అమ్మిన వారికే ప్రొసీడింగ్లు ఇచ్చారన్నారు. రెవెన్యూ అధికారులు అసలైన రైతులకు అన్యాయం చేస్తూ అనర్హుల వద్ద ముడుపులు తీసుకుంటూ వారికే న్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం డీటీ, ఆర్ఐలు బయటకు వచ్చి.. న్యాయం జరగాలంటే ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి అప్పీల్ చేసుకోవాలని, తాము కూడా సహకరిస్తామని చెప్పారు. ఆ తరువాత రైతులను తహసీల్దార్ పిలిపించి మాట్లాడారు. వారి వద్ద సరైన కాగితాలు లేనందునే రెవెన్యూ రికార్డు ప్రకారం భూమి అమ్మినవారికి ఆర్డర్ ఇచ్చామని తహసీల్దార్ తెలిపారు. అయితే, ఆ భూమిలోనే తమ తాతలను సమాధి చేశామని, బోర్లు వేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నామని బాధితులు వివరించారు. ఇన్ని సంవత్సరాలుగా లేనిది, ఇప్పుడు భూములకు ధరలు పెరగడం వల్లే అమ్మినవారు తెరపైకొచ్చారని తెలిపారు. రెవెన్యూ అధికారులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.