Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రగతిభవన్లో మంత్రివర్గమా :సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో సీఎం కె చంద్రశేఖర్రావు నిరంకుశ, రాచరిక పాలన సాగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ప్రగతి భవన్ను సచివాలయంగా మార్చి కేసీఆర్ రాజులా వ్యవహరిస్తున్నారని అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని మఖ్దూంభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సచివాలయంలో జరగాల్సిన మంత్రివర్గ సమావేశం ప్రగతి భవన్లో నిర్వహించడమేంటనీ ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ప్రజాసమస్యల పరిష్కారం పట్ల చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. ప్రాథమికహక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛ కాలరాయబడుతున్నాయని చెప్పారు. ప్రశ్నించినా, ఉద్యమించినా పోలీసులతో అణచివేస్తున్నారని అన్నారు. సచివాలయంలో పాత భవనాలను కూల్చి కొత్త సచివాలయం కట్టాలన్న కేసీఆర్ ప్రతిపాదన రాజులా శాశ్వతంగా పాలించాలన్న ఆలోచన ఉన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. మల్లన్నసాగర్, కొండ పోచమ్మ రిజర్వాయర్ భూనిర్వాసితులకు పునరావాస ప్యాకేజీలు ఇవ్వడం లేదని విమర్శించారు. ఎవరినీ కలవకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలిస్తున్నారని చెప్పారు.