Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కాగజ్నగర్
ఆదివాసీలకు రాష్ట్ర ప్రభుత్వం ఏం మేలు చేసిందో చెప్పాలని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం కొలాంగోంది గిరిజనులు వారం రోజులుగా వేంపల్లి టింబర్ డిపోలో ఆశ్రయం పొందుతుండగా, వారిని మంగళవారం ఆమె పరామర్శించారు. పొట్టకూటి కోసం గిరిజనులు ఎన్నో ఏండ్ల నుంచి మూడు, నాలుగెకరాల్లో సాగు చేసుకుంటుంటే వారిని ద్రోహులుగా చిత్రీకరించి అడవికి దూరం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. అవే భూములను ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధి పేరిట కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తోందన్నారు. అసెంబ్లీ సాక్షిగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు, హక్కు పత్రాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఆ మాటను విస్మరించారన్నారు. హక్కు పత్రాలు, పట్టాలు, రైతుబంధు, గిట్టుబాటు ధర, పంట రుణాలు తదితర ఏ పథకాలను ప్రభుత్వం ఆదివాసీలకు కల్పించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అడవులను నాశనం చేసిన స్మగ్లర్లే ఇవాళ కేసీఆర్ పక్కన ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారని ఆరోపించారు. కొలాంగోంది గిరిజనులు ఎక్కడికీ వెళ్లరనీ, వారిని ఏ గ్రామం నుంచి వెళ్లగొట్టారో మళ్లీ అక్కడే పునరావాసం కల్పించాలనీ డిమాండ్ చేశారు.
అనంతరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కొత్తగా పోడు కొట్టేది లేదు - ఉన్న భూములను వదిలిపెట్టేది లేదనేది తమ నినాదమన్నారు. ఈ నినాదంతోనే ఉన్న భూములను కాపాడుకునేందుకు పోడు పోరు చేపడతామని స్పష్టం చేశారు. 1929 అటవీ చట్టం హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, మెదక్, గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల తదితర ప్రాంతాలకు వర్తించదా..? అక్కడి రిజర్వ్ ఫారెస్ట్ భూములను బడా పారిశ్రామికవేత్తలు ఆక్రమించుకున్న విషయం ప్రభుత్వానికి తెలిసీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అమాయక ఆదివాసీ గిరిజనులను అడవులకు దూరం చేసి ఆ తర్వాత ఆ భూములను పెట్టుబడిదారులకు అప్పగించే కుట్ర జరుగుతోందన్నారు. గిరిజనులు టింబర్ డిపోలో దుర్భర జీవనం సాగిస్తున్నా స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడం బాధాకరమన్నారు. అభివృద్ధి పేరిట టీఆర్ఎస్లో చేరిన మరో ఎమ్మెల్యే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పోడు భూములకు ఎందుకు పట్టాలిప్పించడం లేదని ప్రశ్నించారు. చివరికి గిరిజనుల ప్రధాన ఆహారమైన అంబలి, జావను అసెంబ్లీలో పంపిణీ చేసి తన రాజకీయ ప్రయోజనం కోసం వాడుకున్నారని విమర్శించారు.