Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీస్రేట్ విధానం రద్దు చేయాలి
- రాష్ట్ర విద్యుత్ మీటర్స్ యూనియన్ డిమాండ్
నవతెలంగాణ-ముషీరాబాద్
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న మీటర్ రీడర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర విద్యుత్ మీటర్స్ యూనియన్ అధ్యక్షులు దోమ కొండ సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యుత్ మీటర్ రీడర్లు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 ఏండ్లుగా మీటర్ రీడర్లుగా పనిచేస్తున్న వారికి ప్రభుత్వం ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, యాజమాన్యానికి ఎన్నిమార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేదన్నారు.
48 రోజులుగా తామంతా సమ్మెబాట పట్టినప్పటికీ ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న పీస్ రేట్ విధానాన్ని రద్దు చేసి మీటర్ రీడర్లకు ఈఎస్ఐ, ఈపీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యక్షులు గుర్రం శ్రీనివాస్ మాట్లాడుతూ.. మీటర్ రీడర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని, 30 రోజుల పనిదినాలు కల్పించాలని కోరారు. కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని విఙ్ఞప్తి చేశారు. అర్హత ఉన్న వారిని ఆర్టిజెన్స్గా గుర్తించి, తమ సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు బచ్చగోని శివరాం, సహాయకార్యదర్శి కొండపు శేఖర్, సభ్యులు యన్.కే.మున్నీర్, వడ్ల బ్రహ్మం, బుర్ర సతీష్, నర్సింహులు, శ్రీనివాస్ రవికుమార్ పాల్గొన్నారు.