Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్య విద్య అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సు పెంచొద్దని డిమాండ్
- కోటి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముట్టడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మెడికల్ ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయస్సును పెంచడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(టీజీడీడీఏ) పిలుపు మేరకు హైదరాబాద్ కోటిలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని మంగళవారం ముట్టడిం చారు. డీఎంఈ రమేశ్రెడ్డి చాంబర్లో బైఠాయించి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నెలాఖరున రిటైర్ అవ్వాల్సిన రమేశ్రెడ్డి, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి వయసు పెంపును ముందుకు తోస్తున్నారని ఆరోపించారు. తద్వారా తన పదవిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. డాక్టర్లను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డాక్టర్లు ప్రతిఘటిం చడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. సుమారు 2 గంటల పాటు కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీజీజీడీఏ ప్రెసిడెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ పల్లం ప్రవీణ్ మాట్లాడుతూ వయస్సు పెంపు కంటే ముందు కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అమల్జేయాలని డిమాండ్ చేశారు. సీఏఎస్ అమలు చేయకుండా డీఎంఈ రమేశ్రెడ్డి, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్గా పదేండ్లకుపైగా పన్జేశామని, ఇప్పుడు ఏడేండ్లు వయసు పెంచితే మరో ఏడేండ్లు తాము అసోసియేట్లుగానే ఉండిపోవాల్సి వస్తుందన్నారు. అందుకే, తాము సీఏఎస్(టైమ్ బాండ్ ప్రమోషన్స్) కోరుకుంటున్నామని.. సీఏఎస్ ఇస్తే విరమణ వయస్సు ఎంత పెంచినా అభ్యంతరంలేదని అసోసియేట్ ప్రొఫెసర్ నరహరి తెలిపారు.
విధులు బహిష్కరించిన జూడాలు
ఉద్యోగ విరమణ వయసు పెంపును నిరసిస్తూ జూనియర్ డాక్టర్స్ మంగళవారం విధులు బహిష్క రించారు. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ సహా ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ విధులకు హాజరుకాబోమని జూడా అసోసియేషన్ చైర్మెన్, డాక్టర్ విజయేందర్ తెలి పారు. టీచింగ్ హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్న 1200 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఇందిరాపార్కు ధర్నా చౌక్ నిరుద్యోగ డాక్టర్ల సభ నిర్వహించింది. టీఎస్ డీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అన్వేష్, హెచ్ఆర్డీఏ ప్రెసిడెంట్, డాక్టర్ మహేశ్, నిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కన్వీనర్, డాక్టర్ జి.శ్రీనివాస్, తదిత రులు రోజంతా నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ.. పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని, పోస్టుల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు. అవసరమైన డిపార్ట్మెంట్లలో ప్రొఫెసర్లను ఒప్పంద పద్ధతిలో తీసుకోవాలని సూచించారు.
బోధనా డాక్టర్ల ఉద్యోగ విరమణ వయస్సు పెంపు సరైందే : పీపీటీజీడీఏ,వైద్యవిద్య ప్రొఫెసర్ల అసోసియేషన్
ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగంగా వైద్య విద్య మెరుగుదలకు, అందరికీ వైద్యం అందేలా చూసేందుకు బోధనా డాక్టర్ల ఉద్యోగ విరమణ వయస్సును 58 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని ప్రీ అండ్ పారా క్లినికల్ ప్రభుత్వ వైద్యుల సంఘం(పీపీటీజీడీఏ) ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృపాల్సింగ్, వైద్య విద్య కళాశాలల ప్రొఫెసర్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ రమాదేవి అన్నారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమా వేశంలో వారు మాట్లాడుతూ...బంగారు తెలంగాణ, ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయం కీలక పాత్ర పోషించబోతుందని ఆశాభా వం వ్యక్తం చేశారు. ఉద్యోగ విరమణ వయస్సును పెంచడం వల్ల తాము నష్టపోతామని కొందరు డాక్టర్లు విషప్రచారం చేస్తున్నారని, వారి ఆందోళన వెనుక ప్రయివేటు మెడికల్ కళాశాలలు, కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఉన్నాయని విమర్శిం చారు. ఉద్యోగ విరమణ పెంపు నిర్ణయం ఇప్పుడు తీసుకున్నది కాదని, గతేడాదే తీసుకున్నారని తెలిపారు. పలురాష్ట్రాల్లో మెడికల్ ప్రొఫెసర్ల ఉద్యో గకాలం 65 ఏండ్లు ఉందని, ఎమ్సీఐ నిబంధనల్లో 70 ఏండ్ల వరకు ఉందని గుర్తుచేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 40 శాతం వైద్య విద్య బోధించే డాక్టర్లు తక్కువగా ఉన్నారని, ఈ నిర్ణయంతో కొంత మేరకు ప్రొఫెసర్ల కొరత తీరుతుందని అన్నారు. వయస్సు పెంపుతో అనువజ్ఞులైన డాక్టర్ల సేవలు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివే విద్యార్థులకు అందే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరిన్ని మౌలిక వసతులు కల్పిస్తే కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా వైద్యసేవలు అందిస్తామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పీహెచ్సీలు, ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే డాక్టర్ల ఉద్యోయగ విరమణ వయస్సును కూడా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో పనిచేసే ప్రభుత్వ వైద్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. గాంధీ మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సులేమాన్ మాట్లాడుతూ.. చిన్న చిన్న రోగాలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో లక్షల ఫీజులు వసూలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. స్వైన్ఫ్లూ వంటి కేసులను స్వీకరించేందుకు కార్పొరేట్ వైద్యశాలలు ముందుకు రావని, వాటిని టేకప్ చేసేది ప్రభుత్వ వైద్యశాలలేనని అన్నారు. అతి తక్కువ స్టాఫ్తో ఎక్కువ సేవలు అందించాల్సి రావడంతోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వైద్యశాఖలోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అసిస్టెంట్, అసోసియేటెడ్ ప్రొఫెసర్లకు అన్యాయం జరుగకూడదనే రాష్ట్ర ప్రభుత్వం కెరీర్ అడ్వాన్స్డ్ స్కీమ్ని తెచ్చిందన్నారు. వైద్య విద్యప్రొఫెసర్ల వయస్సును పెంచాలని నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు, వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీపీటీజీడీఏ కోశాధికారి డాక్టర్ బాబూరావు, పలువురు డాక్టర్లు పాల్గొన్నారు.