Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశ్రాంత ఇంజినీర్ల సంఘం
- తెలంగాణ ప్రజలకు వరప్రదాయిని అని కితాబు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
కాళేశ్వరం ప్రాజెక్టుపై కొందరు పనికట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అభిప్రాయపడింది. విశ్రాంత ఇంజినీర్లు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క, లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ప్రజలను పక్కదారి పట్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పనులు పూర్తి కాకుండానే కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారని వస్తున్న ఆరోపణలను వారు ఖండించారు. మూడు బ్యారేజీలు, పంప్హౌస్ల పనులు పూర్తి కావచ్చాయని, మొత్తం 65 శాతం పనులు పూర్తయ్యాయని వారు తెలిపారు. విశ్రాంత ఇంజినీర్లు చంద్రమౌళి, వెంకట రామారావు, శ్యాం ప్రసాదరెడ్డి, దేవరుప్పల భీమయ్య కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్ర, ప్రస్తుత పరిస్థితిని గురించి వివరించారు. శ్యాం ప్రసాదరెడ్డి మాట్లాడుతూ నాగార్జునసాగర్, శ్రీరామ్సాగర్ ప్రాజెక్టుల పనులు పూర్తి కాక ముందే ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులు ప్రారంభించిన తర్వాత కాల్వల పనులు ఏండ్ల తరబడి కొనసాగాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అతి కీలకమైన మూడు బ్యారేజీలు పంప్హౌస్లు పూర్తయ్యాయని చెప్పారు. ప్రస్తుత ఖరీఫ్ కాలంలో ఎస్సారెస్పీ ఆయకట్టుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరందుతుందని, కాకతీయ కాల్వ రెండవదశకు కూడా నీరు విడుదల చేస్తారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయంపై ఆయన వివరణ ఇచ్చారు. 16,40,00 ఎకరాలకు నీరందించాలని ప్రతిపాదించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అంచనా వ్యయం 2010 నాటికే 40 వేల కోట్లకు చేరిందని, ఇదే ప్రాజెక్టును కొనసాగించి ఉంటే గత సంవత్సరానికే రూ. 60 వేల కోట్లకు చేరేదన్నారు. 36 లక్షల ఎకరాలకు సాగునీరందించే కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 80 వేల కోట్లని ఆయన వివరించారు. విశ్రాంత ఇంజినీర్ వెంకట రామారావు మాట్లాడుతూ కరువుతో అల్లాడుతున్న తెలంగాణకు సాగునీరందించటమే ముఖ్యమన్నారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత కేవలం 160 టీఎంసీలు మాత్రమేనని, దీనిలో మహారాష్ట్ర వాటా పోను మిగిలేది 102 టీఎంసీలేనని సీడబ్ల్యూసీ నివేదిక ఇచ్చిన తర్వాతే రీడిజైన్లో భాగంగా మేడిగడ్డ నుంచి నీరు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మూడు బ్యారేజీల వద్ద 50 టీఎంసీల నీరు ఎప్పుడూ నిల్వ ఉంటుందని విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు సంగెం చందమౌళి తెలిపారు. రీడిజైన్లో భాగంగా 141 టీఎంసీల నీరు నిల్వ ఉండే విధంగా 14 రిజర్వాయర్లను ప్రభుత్వం నిర్మిస్తున్నదని వీటి ద్వారా రెండు పంటలకు నీరందించవచ్చని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం తర్వాత బోరు బావుల కరెంటు వినియోగం తగ్గుతుందన్నారు. విశ్రాంత ఇంజినీర్ దేవరుప్పల భీమయ్య మాట్లాడుతూ ప్రాజెక్టు ద్వారా వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు వస్తాయని, మత్స్య సంపద పెరుగుతుందని, పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఫలితంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని చెప్పారు.