Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎంఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి
నవతెలంగాణ- ఖమ్మంటౌన్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష రైతు రుణమాఫీ ఒకే విడతలో చేయాలని ఏఐకేఎంఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. నాలుగు దఫాలుగా రుణమాఫీ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని మంచికంటి భవన్లో తెలంగాణ రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు బండి రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సారంపల్లి మాట్లాడారు. రుణమాఫీ చేసి వెంటనే కొత్త రుణాలు ఇవ్వాలన్నారు. గత వ్యవసాయ సీజన్లో రాష్ట్రంలో 9లక్షల మందికి రైతుబంధు అందలేదని తెలిపారు. పట్టాదారు పాస్పుస్తకాల మంజూరీలో రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం వీడాలని, 1బీ ఆధారంగా రైతుబంధు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాల నివారణపై అధికారుల హడావుడి తప్ప ఆచరణ లేదని, మార్కెట్లో విచ్చలవిడిగా నకిలీ విత్తనాలు చలామణీ అవుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్ మాట్లాడుతూ.. జులై 11, 12, 14, 15 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న అఖిల భారత కిసాన్ సభలను జయప్రదం చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నున్నా నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి మాదినేని లక్ష్మి, పొన్నం వెంకటేశ్వరరావు, కమిటీ సభ్యులు బొంతు రాంబాబు, తాతా భాస్కర్రావు, కట్టా గాంధీ పాల్గొన్నారు.