Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టర్లతో జిల్లా యంత్రాంగం కుమ్మక్కు
- ఆదివాసీల అభ్యంతరాలు బేఖాతరు
- అడుగడుగునా నిబంధనలకు పాతర
- నదిలోనే ట్రక్కుల లోడింగ్
- గ్రామసభల అనుమతి లేకుండానే..
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిది
నిబంధనలకు విరుద్ధంగా కిన్నెరసానిపై ఇసుక తవ్వకాలను కొనసాగిస్తున్నారు. ఆదివాసీల అందోళనతో మూడు రోజుల పాటు విరామం ప్రకటించిన అధికార యంత్రాంగం సోమవారం నుంచి వీటిని మళ్లీ ప్రారంభించింది. ఈ వ్యవహారంలో కొందరు ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్టు తెలుస్తున్నది. సీతారామ ప్రాజెక్టు పనుల పేరుతో ఇసుక తవ్వకాలకు అనుమతులు పొందిన కొందరు కాంట్రాక్టర్లు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని దంతెలబోరు, నారాయణపేట, బూర్గంపాడు మండలం లోని సోంపల్లి గ్రామాల పరిధిలో కిన్నెరసాని నదిలో 1,44,802 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన జిల్లా ఇసుక కమిటీ ఇటీవల అనుమతులనిచ్చింది. పర్యావరణ అనుమతులు లేకుండానే రెండు ప్రముఖ కంపెనీలకు ఇసుక తవ్వకాల కోసం అనుమతులనిచ్చారు. ఇసుక తవ్వకాలకు యంత్ర పరికరాలను వినియోగించ రాదని, ఒక మీటర్ కన్నా ఎక్కువ లోతులో ఇసుకను తీయవద్దని నిబంధనల్లో పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ నిబంధనలను కాంట్రాక్టు కంపెనీలు పట్టించుకోవటం లేదు. కూలీలకు పనులు అప్పగించకుండా నేరుగా జేసీబీలను నదీ లోకి దింపి ఇసుక తవ్వకాలను కొనసాగిస్తున్నారు. ట్రక్కులను నేరుగా నదిలోకి పోనిచ్చి అక్కడే వాటిని నింపుతున్నారు. మూడు మీటర్ల లోతు వరకూ ఇసుకను తవ్వటంతో భూగర్భ జలాలు ఇంకి పోతాయని మూడు పంచాయితీ పరిధిలోని ఆదివాసీలు ఆందోళన బాట పట్టారు. యంత్రాల ద్వారా ఇసుక తవ్వకాలను అనుమతించవద్దని, గిరిజన సహకార సంఘాలకు వీటిని అప్పగించాలని కోరారు. ఇసుక తవ్వకాల్లో జరుగుతున్న అక్రమాలపై జిల్లా కలెక్టర్కు రెండు సార్లు ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించక పోవటంతో దంతెలబోరు గ్రామానికి చెందిన ఆదివాసీలు ఇసుక లారీలను ఇటీవల ఆపివేసి నిరసన వ్యక్తం చేవారు. అయినప్పటికీ అధికార యంత్రాంగం కాంట్రాక్లర్ల పక్షానే నిలిచింది. ఈ వ్యవహారం వెనుక గనుల శాఖకు చెందిన ఒక అధికారి హస్తం ఉన్నట్టు ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. కొందరు గ్రామస్తులకు కాంట్రాక్లర్లు భారీగా ముడుపులు చెల్లించారని ఒక అధికారి ప్రచారం చేయటంతో ఆదివాసీలు ఆ అధికారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
గ్రామసభల అనుమతులు లేకుండానే...
కిన్నెరసానిలో ఇసుక తవ్వకాలు జరిగే పాల్వంచ మండలంలోని మూడు గ్రామపంచాయితీలు గిరిజన ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు జరపాలంటే షెడ్యూల్డు ప్రాంతాలకు పంచాయితీరాజ్ విస్తరణ (పీసా) చట్టం ప్రకారం గ్రామ సభలను అనుమతి తీసుకోవాల్సి ఉన్నది. మూడు గ్రామపంచాయితీల పరిధిలో గ్రామసభలు నిర్వహించకుండానే నిర్వహించినట్టు తప్పుడు పత్రాలను కొందరు అధికారులు సృష్టించారని దంతెలబోరు కు చెందిన ఆదివాసీ యువకులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనికి బాధ్యలైన అది óకారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయినప్పటికీ ఇసుక తవ్వకాలు కొనసాగటం పట్ల వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం లోగా ఇసుక తవ్వకాలను నిలిపివేయకపోతే తామే నిలిపివేస్తామని వారు హెచ్చరిం చారు. అవసర మైతే హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.