Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విధాన నిర్ణయాల అమలుకు సమయం కావాలి :హైకోర్టుకు తెలిపిన సర్కారు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మున్సిపాల్టీలకు ఎన్నికల ఏర్పాట్లు చేసేందుకు అయిదు నెలలు సమయం అవసరం అవుతుందని హైకోర్టుకు ప్రభుత్వం తెలియ జేసింది. ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయంలో భాగంగా దగ్గ ర్లోని గ్రామాల్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో విలీనం, పెద్ద పంచాయతీలను మున్సిపాల్టీలుగా చేయడం వంటి విధాన నిర్ణయాన్ని అమలు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్
హైకోర్టుకు దాఖలు చేసిన కౌంటర్ వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఎన్నికలు సకాలంలో నిర్వహించేందుకు ప్రభుత్వం వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు చేయాలని రెండు లేఖలు రాసినా చేయడం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టులో రిట్ వేసింది. వచ్చే నెల రెండుతో పాలకవర్గాల గడువు ముగియబోతున్నందున ఎన్నికలకు ప్రభుత్వం చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని తెలంగాణ బీసీ సంఘం కూడా రిట్ వేసింది. వీటిలో ప్రభుత్వం తన వాదనను తెలియజేస్తూ కౌంటర్ వ్యాజ్యాన్ని వేసింది. ఈ రిట్లపై బుధవారం విచారణ చేస్తామని న్యాయమూర్తి జస్టిస్ నవీన్రావు చెప్పారు. ముందస్తు ఎన్నికల తంతు పూర్తి చేసేందుకు 141 రోజులు, ఆ తర్వాత ప్రభుత్వానికి మరో పది రోజులు కలిపి 151 రోజుల గడువు కావాలని ఆయన హైకోర్టుకు విన్నవించారు. వార్డుల పునర్విభజన కోసం 30 రోజులు, వాటిపై తుది నోటిఫికేషన్కు 7 రోజులు, వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీకి 30 రోజులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తించేందుకు 60 రోజులు, వార్డులను వివిధ వర్గాలకు కేటాయింపునకు 7 రోజులు, మున్సిపల్ వార్డులు, మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ పదవుల రిజర్వేషన్ల ఖరారుకు 7 రోజులు.. ఇలా మొత్తం 141 రోజులు అవసరమని తెలిపారు. ఆ తర్వాత ప్రభుత్వానికి మరో పది రోజులు అవసరమని చెప్పారు. జులై 2తో రాష్ట్రంలోని 53 మున్సిపాల్టీలు, 3 మున్సిపల్ కార్పొరేషన్ల పాలన ముగుస్తుందని, ఈలోగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే అందుకు అవసరమైన ముందస్తు తంతుకు అయిదు నెలల సమయం అవసరం అవుతుందని తెలిపారు. చిన్న గ్రామాల్ని మున్సి పాల్టీలు, కార్పొరేషన్లలో విలీనం, పెద్ద పంచాయతీల్ని మున్సిపాల్టీ లుగా చేయడం తదితర అంశాలపూ ప్రభుత్వం పాలనాపరంగా విధాన నిర్ణయం తీసుకుందన్నారు. అందులో భాగంగా 131 గ్రామాల్ని 42 మున్సిపాల్టీలు లేదా మున్సిపల్ కార్పొరేషన్లల్లో విలీనం చేయాలని నిర్ణయించామన్నారు. 173 గ్రామాల్ని 68 మున్సిపాల్టీలుగా చేశామ న్నారు. వీటన్నింటికీ ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా చేయాల్సిన ఎన్నికల ప్రక్రియకు 151 రోజుల సమయం పడుతుందన్నారు. ఈ రిట్లపై బుధవారం హైకోర్టు విచారణ జరపనుంది.