Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిదానికీ పీఎంని పిలవాల్నా!
- కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభంపై సీఎం వ్యాఖ్యలు
'ఎర్రమంజిల్లో కొత్త అసెంబ్లీకి వందకోట్లు. హెరిటేజ్ భవనంగా పాత అసెంబ్లీ. ప్రస్తుత స్థలంలోనే నూతన సచివాలయం. జులైలో మున్సిపల్ ఎన్నికలు. పొరుగురాష్ట్రాలతో
సత్సంబంధాలు. కలిసి పోతాం..నీళ్లు పంచుకుంటాం. ఉద్యోగ విరమణ వయస్సు 61కి పెంపుపై చర్చిస్తాం. టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలకు, శారదాపీఠం, ఎన్.శంకర్ స్టూడియోలకు
స్థలాల కేటాయింపు.
- క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించిన సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
''కాళేశ్వరం సాధకుడ్ని నేనే. కేంద్రం నయాపైసా ఇవ్వలేదు. రాష్ట్రం సొంత డబ్బులు, బ్యాంకుల రుణాలతో కట్టినం. ప్రతిదానికీ పీఎంని పిలవాలని లేదు కదా? మిషన్ భగీరథ ప్రారంభానికి పిలిచాం. కష్టపడి చరిత్రలోనే గొప్పదైన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం. గవర్నర్ నరసింహన్ ఆధ్వర్యంలో ప్రాజెక్టును నేనే ప్రారంభించబోతున్న'' అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని ప్రగతిభవన్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మంగళవారం జరిగింది. క్యాబినెట్లో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను మంత్రులు మహ మూద్అలీ, జగదీశ్రెడ్డి, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్గౌడ్, ప్రశాంత్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, నిరంజన్రెడ్డి లతో కలిసి సీఎం కేసీఆర్ మీడియాకు వెల్లడించారు.
నూతన సచివాలయం, అసెంబ్లీ భవనాలకు ఈ నెల 27న భూమిపూజ చేస్తామని సీఎం తెలిపారు. ఎర్రమంజిల్లో వంద కోట్ల రూపాయలతో పార్లమెంట్ మోడల్లో కొత్త అసెంబ్లీని తూర్పు ముఖంగా కట్టబోతున్నామని, ప్రస్తుత అసెంబ్లీని చారిత్రక భవనంగా ఉంచుతామని ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న స్థలంలోనే 5 నుంచి 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన సచివాలయాన్ని నాలుగు వందల కోట్ల రూపాయల లోపుతో నిర్మిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలకు జులై చివరకల్లా ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. పది, పదిహేను రోజుల్లో ఆ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించామన్నారు. నూతన మున్సిపల్ చట్టాన్ని ఇప్పుడే తేవాలా? ఆర్డినెన్స్ తెచ్చి ఎన్నికలు నిర్వహించాలా? అనే దానిపై ఆలోచిస్తున్నామన్నారు. నూతన పం చాయతీ రాజ్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తామన్నారు. హరిత హారం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తదితర వాటి అమల్లో గ్రామపంచాయతీని భాగస్వామ్యం చేస్తామన్నారు. ఇండియాలో అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని గర్వంగా చెప్పారు. ఖాళీ బిందెలతో జనం రోడ్లెక్కి ఆందోళన చేసే పరిస్థితి నుంచి అసలు తాగునీటి సమస్యనే లేకుండా చేశామన్నారు. 100శాతం మిషన్ భగీరథ పూర్తి కాబోతున్నదన్నారు.
సత్సంబంధాలు కొనసాగిస్తాం..ప్రతి అంగుళాన్నీ తడుపుతాం
ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలను కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయించిందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాక ముందు కర్నాటక, మహారాష్ట్రతో నిత్యం బస్తీమే సవాల్ అనేలా పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు ఆ రాష్ట్రాలతో సంబంధాలు మెరుగుపడ్డాయన్నారు. మహారాష్ట్ర సహకారంతోనే కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా పూర్తిచేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడంతో పాటు రాష్ట్ర పారిశ్రామిక, తాగునీటి అవసరాలను తీర్చనున్నామన్నారు. ఇంత తొందరగా కాళేశ్వరం పూర్తయిందా అని మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. కర్నాటకతో మూడు సార్లు నీళ్లను ఇచ్చిపుచ్చుకున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టోళ్లు 200 దాకా కేసులు వేశారని, ఎన్ని కుట్రలు పన్నినా మహాకార్యం ఆగలేదని అన్నారు. 50 ఏండ్లుగా పెండింగ్లో ఉన్న లోయర్ పెన్గంగ ప్రాజెక్టు చరానా..కొరాటా రూపంలో ప్రాజెక్టుగా పూర్తికాబోతున్నదని, ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం మరువలేనిదని అన్నారు. కృష్ణా, గోదావరి బేసిన్ నికర, వరద జలాలు కలిపి సుమారు ఐదు వేల టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయని, వాటిని సుహృద్భావ వాతావరణంలో పంచుకునేందుకు ఏపీ సీఎం జగన్తో కలిసి నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ తెలిపారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి అంగుళానికీ సాగునీటిని అందించవచ్చన్నారు. ఏపీ, తెలంగాణకు గోదావరి జలాల్లో 1480 టీఎంసీలు, కృష్ణా నదిలో 811 టీఎంసీ వాటా ఉందని తెలిపారు. ప్రతియేటా 3,500 టీఎంసీల నీళ్లు సముద్రం పాలు అవుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. చివరి రాష్ట్రాలు కావడంతో సముద్రంలో కలిసే నీళ్లను వాడుకునే వెసులుబాటును తెలంగాణ, ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ కల్పించిందని, దానిని సద్వినియోగం చేసుకుంటామని సీఎం అన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఏపీ సాగునీటి అధికారులు త్వరలో రాష్ట్రంలో పర్యటించి నీళ్ల వాడకంపై చర్చిస్తారనీ, ఆ తర్వాత మన సాగునీటి అధికారులు ఏపీలో పర్యటిస్తారనీ తెలిపారు. సీతారామ, దేవాదుల ప్రాజెక్టులు పూర్తికాబోతున్నాయని, ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకల్లా ప్రారంభిస్తామని ప్రకటించారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కూడా త్వరలోనే పరుగులు పెట్టిస్తామన్నారు. ఏడాదిలోగా తెలంగాణలో సాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాగునీరు అందుబాటులోకి వస్తే గతంలో ఎన్నడూ చూడని విధంగా అన్ని రంగాల్లోనూ మంచి ఫలితాలను చూడవచ్చన్నారు. ఉద్యోగ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంపుపై సుదీర్ఘంగా క్యాబినెట్లో చర్చ నడిచిందని, మళ్లీ ఉద్యోగ సంఘాల నేతలను పిలిచి పీఆర్సీ, ఉద్యోగ విరమణ వయస్సుపై సంప్రదింపులు జరిపి తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు.
గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ రాక..మీడియాకు నో అనుమతి తెలంగాణకే వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి ఏపీ, మహారాష్ట్ర సీఎంలను ప్రత్యేకంగా వెళ్లి ఆహ్వానించామన్నారు. సీఎం జగన్ తన సొంత హెలికాప్టర్లో వస్తారని తెలిపారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, గవర్నర్, బ్యాంకర్లను తీసుకెళ్లేందుకు నాలుగు హెలికాప్టర్లను వాడుతున్నామన్నారు. మేడిగడ్డ, కన్నెపల్లి రిజర్వాయర్లను తాను ప్రారంభిస్తానని సీఎం తెలిపారు. ప్రాజెక్టు ప్రారంభం పకడ్బందీగా నిర్వహించేందుకు ఐదుగురు మంత్రులకు అప్పగించామని, ఒక్కో చోట ఒక్కో మంత్రి బాధ్యత నిర్వహిస్తారని తెలిపారు. 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి మీడియాను అనుమతించట్లేదని, సుహృద్భావంతో అందరూ అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో దట్టమైన అరణ్య ప్రాంతంలో ఉందని, అక్కడ పదెకరాల ఖాళీ స్థలం కూడా ఉండదని, అసలే వర్షాకాలం కావడంతో అక్కడకు వచ్చి ఇబ్బంది పడకూడదనే మీడియాకు అనుమతి నిరాకరించామని తెలిపారు. దీనిని ఎవ్వరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దన్నారు. అయితే, ఇంత గొప్ప ప్రాజెక్టు ప్రారంభం కవరేజీకి ఇబ్బంది రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, అన్ని మీడియా ఛానళ్లకు, ప్రింట్ మీడియాకు ఏస్ మీడియా ద్వారా పిన్ టూ పిన్ సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తామని హామీనిచ్చారు.
అఖిలపక్ష సమావేశానికి కేటీఆర్
ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన త్వరలో జరగబోయే అఖిపక్ష సమావేశానికి తమ పార్టీ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను పంపనున్నట్లు సీఎం తెలిపారు. వివిధ అంశాలపై చర్చించేందుకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్న పార్టీల అధ్యక్షులతో ఈ సమావేశం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
భూముల కేటాయింపు
30 జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం స్థలాలు కేటాయించామన్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో స్థలం ఫైనల్ కాకపోవడంతో పెండింగ్లో పెట్టామని, ఖమ్మం జిల్లాలో ఇప్పటికే కార్యాలయం ఉన్నందున మినహాయించామని తెలిపారు. హైదరాబాద్లో రాష్ట్ర కార్యాలయం ఉంది కాబట్టి పరిగణనలోకి తీసుకోలేదన్నారు. మిగతా అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాల నిర్మాణాలకు స్థలాలు కేటాయించామన్నారు. ప్రముఖ సినీ డైరెక్టర్ ఎన్.శంకర్ స్టూడియో నిర్మాణం కోసం స్థలం కావాలని అర్జీ పెట్టుకున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిదన్నారు. ఆయన అర్జీ మేరకు హైదరాబాద్ సమీపంలోని శంకర్పల్లి పరిసర ప్రాంతంలో ఎకరాకు ఐదు లక్షల చొప్పున ఐదెకరాలను కేటాయించినట్టు ప్రకటించారు. శారదా పీఠం ట్రస్టు తన కార్యకలాపాలను తెలంగాణలో నిర్వహించుకునేందుకు రెండెకరాలను ఇచ్చామన్నారు. అక్కడ వారు వేద పాఠశాల నిర్వహిస్తారన్నారు.
సచివాలయంపై సబ్కమిటీ..ఉంచాలా? కూల్చాలాపై నిర్ణయం
ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని పూర్తిగా కూల్చివేయాలా? లేక కొన్ని బిల్డింగ్లను అలాగే ఉంచాలా? అనే విషయాన్ని తేల్చేందుకు ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నేతృత్వంలో సబ్కమిటీని ఏర్పాటు చేసినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ కమిటీలో మరో ఇద్దరు మంత్రులు సభ్యులుగా ఉంటారని ఆయన తెలిపారు. అయితే, కమిటీ ఇచ్చే రిపోర్టు పైన తుది నిర్ణయం తీసుకునే అధికారం మంత్రి వర్గం ముఖ్య మంత్రికే అప్పజెప్పిందని వెల్లడించారు. హైదరాబాద్లో ఉగ్ర మూలాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తీరును ఈసందర్భంగా సీఎం తప్పుబట్టారు. ఆయన మాటల్ని విని ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అవి పనికిరాని మాటలంటూ కొట్టిపారేశారు. కేంద్ర ప్రభుత్వంతో రాజ్యాంగబద్దమైన, చట్టబద్ధమైన సంబంధాల ను ఆయన స్పష్టం చేశారు. ఎన్డీయేలో టీఆర్ఎస్ భాగస్వామి కాదని, ఇదే సమయంలో ఫెడరల్ ఫ్రంట్ను ముందుకు తీసుకొచ్చిన వ్యక్తిగా తనకు క్రెడిబులిటీ దక్కుతుందని అన్నారు. మోడీని ఫాసిస్టు పీఎంగా తాను అభివర్ణించినట్టు గుర్తుచేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు కేంద్రం ఒక్క పైసా విదల్చలేదని విమర్శించారు. వెనుకబడిన జిల్లాలకు కూడా సహాయం చేయలేదన్నారు.