Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మం జైలు ఎదుట ఉద్విగ వాతావరణం
- చిన్నారులను తల్లిదండ్రులతో కలిపించిన జైలు అధికారి
''అమ్మా.. నిన్నూ నాన్నను ఒక్కసారి చూడాలని ఉందమ్మా.. మీరు లేకపోతే మాకు ఇంట్లో ఉండబుద్ది కావడం లేదు.. ఒక్కసారి నాన్న నువ్వూ బయటికి రాండమ్మా.. మమ్మల్నీ మీతో పాటు లోపలికి (జైలులోకి) తీసుకెళ్లండమ్మా..'' అంటూ ఐదేండ్లలోపు వయసున్న ఆదివాసీ చిన్నారులు సమీర, అంజలి జైలు ఆవరణలో కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో ఆ పరిసరాల్లో తీవ్ర ఉద్విగ వాతావరణం నెలకొంది.
నవతెలంగాణ-ఖమ్మం ప్రతినిధి
ఈ నెల 2న భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం చలమన్ననగర్లో అటవీ అధికారులపై దాడికి పాల్పడ్డారంటూ 12మంది ఆదివాసీలపై పీడీపీపీ యాక్టు కింద కేసులు నమోదు చేశారు. వారిని ఖమ్మం జిల్లా జైల్లో ఉంచారు. 12 మందిలో ఈ చిన్నారుల తల్లిదండ్రులు కణితి భద్రమ్మ- రాజు కూడా ఉన్నారు. పిల్లలు తల్లిదండ్రులకు దూరమై.. ఇంట్లో చిన్నారుల బాగోగులు చూసే వారులేక.. ఆదివాసీలే అన్నం పెడుతున్నారు. తల్లిదండ్రులకు దూరమై.. బెంగతో ఏడుస్తున్న చిన్నారులను గురువారం సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, మీడియా ప్రతినిధుల ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు కలిపేందుకు తీసుకెళ్లారు. సమీర, అంజలిని జైలు వద్ద పలువురు ఓదార్చారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు, మీడియా ప్రతినిధుల విన్నపం మేరకు జైలు సూపరింటెండెంట్తో పాటు అక్కడున్న సిబ్బంది స్పందించారు. చిన్నారులను జైలులోకి తీసుకెళ్లి తల్లిదండ్రుల ఒడికి చేర్చారు. వారం రోజులుగా చంటిపిల్లలకు దూరమై ద్ణుఖ సాగరంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లలను చూడగానే బోరున విలపించారు. కొద్దిసేపటి తరువాత పిల్లలను నాయకులు పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లారు.
ఇదేనా టీఆర్ఎస్ ప్రభుత్వ మానవత్వం పోటు రంగారావు ఆదివాసీల పట్ల కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించే మానవత్వం ఇదేనా? ఒక పక్క గిరిజనులకు పోడు హక్కులు కల్పిస్తామంటూనే.. మరోపక్క వారిని అడవుల్లోంచి తరిమే కుట్రలకు పాల్పడుతోంది. ఇది దుర్మార్గమైన చర్య. దాదాపు 30ఏండ్లుగా పోడు చేసుకుంటున్న చలమన్ననగర్ ఆదివాసీలపై దాడులు చేశారు. తిరిగి వారిపైనే కేసులు పెట్టి చంటిపిల్లలున్న తల్లిదండ్రులను జైల్లో పెట్టారు.
భూమి పంపిణీ చేస్తామని లాక్కుంటారా..
నున్నానాగేశ్వరరావు-సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
గిరిజనులపై దాడులు అమానవీయం. కొమురంభీం జిల్లా సార్సాలలో గిరిజనుల భూముల్లో మొక్కలు నాటి వారిని తరిమికొట్టారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని పోడు ప్రాంతాల్లో అలజడి రేపుతున్నారు. గతంలోనూ వందల సంఖ్యలో ఆదివాసీలపై కేసులు పెట్టి జైలుకు పంపారు. ఇప్పుడు చలమన్ననగర్ ఆదివాసీలను జైల్లో పెట్టారు. వారిని బేషరతుగా విడుదల చేసి వారికి హక్కుపత్రాలు ఇవ్వాలి.