Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన మున్సిపల్ చట్టం కోసం
- ఒక రోజుపాటు మండలి
- ప్రశ్నోత్తరాలు, ఇతర అంశాలకు నో
- పూర్తిస్థాయి బడ్జెట్ ప్రస్తావనలేని వైనం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన మున్సిపల్ చట్టాన్ని ఆమోదించటం కోసం ఈనెల 18,19 తేదీల్లో అసెంబ్లీ సమావేశం కానుంది. 19న ఒకరోజుపాటు శాసనమండలి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సమా వేశాల్లో వాయిదా తీర్మానాలుగానీ, ప్రశ్నోత్తరాలుగానీ ఉండబోవు. 18న బిల్లు ప్రతులను శాసనసభ్యులకు అందజేస్తారు. దాని మీద చర్చించేందుకు ఒక రోజు సమయమివ్వనున్నారు. అనంతరం 19న చట్టాన్ని ఆమోదించను న్నారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఆగస్టు మొదటి వారంలో మున్సి పల్ ఎన్నికలను నిర్వహించనున్నట్టు సీఎంకేసీఆర్.. ఆ ప్రకటనలో
తెలిపారు. బిల్లుకు తుదిరూపం ఇవ్వటానికి వీలుగా దాన్ని న్యాయశాఖకు పంపినట్టు వివరించారు. మరోవైపు కేంద్రం పూర్తిస్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన దరిమిలా.. రాష్ట్రంలో కూడా అదే విధంగా పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెడతారని అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా కేసీఆర్ సర్కారు... పూర్తి స్థాయి బడ్జెట్ ఊసెత్తటం లేదు. మొన్నటి వరకూ దీనిపై కొంత చర్చ జరిగినా.. సచివాలయం తరలింపు, నూతన అసెంబ్లీ నిర్మాణం తదితర అంశాలతో అది మరుగున పడిపోయింది. ఇప్పుడు కూడా అటు ఆర్థికశాఖ అధికారులుగానీ, ఇటు ముఖ్యమంత్రి కార్యాలయంగానీ దీనిపై స్పష్టత నివ్వకపోవటం గమనార్హం. ప్రస్తుతం రుతు పవానాలు ముఖం చాటేయటంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో వారికి భరోసా నివ్వాల్సిన ప్రభుత్వం.. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు, వరంగల్లో తొమ్మిది నెలల పాపై అత్యాచారం, హైదరాబాద్లో ప్రేమోన్మాదుల దాడులు తదితర ఘటనలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరోవైపు విష జ్వరాలతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. వీటన్నింటిపై చర్చించి.. పరిష్కార మార్గాలు వెతకాల్సిన ప్రభుత్వం, అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. శాసనసభలో వీటిపై చర్చించటం ద్వారా ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయాలి.. కానీ రాబోయే సమావేశాల్లో అలాంటి చర్చలకు, చర్యలకూ ఆస్కారం లేదని సర్కారే తేల్చి చెప్పటం గమనార్హం.