Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో సహకార ఉద్యమం చేద్దాం..
- రైతు ఆదాయాన్ని పెంచడమే లక్ష్యం
- విత్తనం నుంచి మార్కెటింగ్ వరకు జోక్యం
- ఇదే ప్రభుత్వ విధానాలకు ప్రత్యామ్నాయం:
కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ పిలుపు
- రెండు రోజుల ఏఐకేఎస్ వర్క్షాప్ ప్రారంభం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతులు, వ్యవసాయ కార్మికుల ఆర్థిక పరిరక్షణకు మరో సహకార ఉద్యమం సాగించాలని కేరళ ఆర్థిక మంత్రి డాక్టర్ థామస్ ఐజాక్ పిలుపునిచ్చారు. రైతుల ఆదాయాల పెంపుదల లక్ష్యంగా సామాజిక సహకార వ్యవస్థను బలోపేతం చేయాలని పేర్కొన్నారు. ఈ సహకార సంఘాలు పూర్తి పారదర్శకతతో పని చేయాలని, రైతులు వినియోగించే విత్తనం మొదలుకొని పంటల మార్కెటింగ్ వరకు అన్ని అంశాల్లో సహకారసంఘాలు జోక్యం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధా నాల వలన వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిం దనీ, సమస్య పరిష్కారానికి సాధికారతతో కూడిన సామాజిక సహ కార సంఘాలు ప్రత్యామ్నాయంగా పని చేయాలన్నారు. అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ కౌన్సిల్ సమావేశాలను పురస్కరించుకొని ఏఐకెేఎస్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ), సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్టు సంయుక్తంగా గురువారం ఎస్వీకేలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న 'రైతులు కార్మికుల సహకారం-ప్రపంచ పెట్టుబడి దారీ విధానం నేపథ్యంలో వ్యవసాయంలో, సంస్థాగత పరమైన సంక్షోభాలు-రైతులు, కార్మికులు, సామాజిక సహకార సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయాల నిర్మాణం' అనే అంశంపై వర్క్షాప్ను డాక్టర్ ఐజాక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏఐకెేఎస్ అధ్యక్షులు అశోక్ ధావులే అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఐజాక్ మాట్లాడుతూ గడచిన దశాబ్ద కాలంలో వ్యవసాయ సంక్షోభం తీవ్రతరమైందన్నారు. యుపీఏ-2, ఎన్డీఏ-1 ప్రభుత్వాల హయాంలో నయా-ఉదారవాద ఆర్థిక విధానాల అమల్లో భాగంగా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలన్న లక్ష్యంతో రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీి)లను ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా పెంచట్లేదని వివరించారు. దీని వలన రైతులకు కనీసం పెట్టిన పెట్టుబడి సైతం రాక నష్టాల పాలవుతున్నారన్నారు. రైతులెప్పుడైతే ఆర్థికంగా నష్టపోతున్నారో వ్యవసాయంపై ఆధారపడ్డ కార్మికులకు సైతం కూలి పెరగక చితికిపోతున్నారని చెప్పారు. స్వామినాధన్ కమిషన్ పేర్కొన్నట్టు ఉత్పత్తి వ్యయంపై 50శాతం కలిపి ఎంఎస్పీ నిర్ణయించట్లేదని గుర్తు చేశారు. మోడీ సర్కారు అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు వలన రైతుల ఆదాయాలు మరింత తగ్గాయని తెలిపారు. 'పదేండ్లలో రైతులు పండించే పంటల ఉత్పాదకతలు తగ్గాయి. పంటలకు ధరలూ తగ్గాయి' అని థామస్ అన్నారు.
సర్కారీ పెట్టుబడులకు కోత
వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు గణనీయంగా తగ్గుతున్నాయని ఐజాక్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశీయ స్థూలోత్పత్తి (జీడీపీి)లో ఆస్తుల సృష్టికి చేసే వ్యయం ఈ కాలంలో 31 నుంచి 29 శాతానికి తగ్గిందని గుర్తు చేశారు. ఎంఎస్పీ, రైతుల రుణాల రద్దు, బలవంతపు భూసేకరణ అంశాలపై ప్రధానంగా ఏఐకెేఎస్ ఆందోళనలు చేస్తోందన్నారు. రైతులు, కార్మికులు ఉమ్మడి వ్యవసాయం చేసేలా సహకార సంఘాలను ఏర్పాటు చేసి, ఆ వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ విధానాలకు ప్రత్యామ్నాయమని అభిప్రాయపడ్డారు. ఒక్క సహకార వ్యవస్థ ద్వారానే సమాజం సమూలంగా మారదని మార్క్స్, లెనిన్ ఉటంకించారని, కానీ సామాజిక సహకార సంఘాలు సమాజ మార్పునకు ఒక ఉపకరణంగా భావించాలని చెప్పారు. రైతులను, కార్మికులను ప్రత్యామ్నాయ విధానాల, రాజకీయాల వైపు సమీకరించడానికి సహకార సంఘాలు బాగా ఉపయోగ పడతాయన్నారు.
కేరళలో కోఆపరేటివ్ బలోపేతం
కేరళలో సహకార వ్యవస్థ బలోపేతానికి వామపక్ష సంఘటన శ్రమిస్తోందని ఐజాక్ వివరించారు. రెండంచల సహకార వ్యవస్థను సమర్ధవంతంగా అమలు చేస్తోందన్నారు. సహకార బ్యాంకులు పరిపుష్టంగా పని చేస్తుండటంతో ప్రవాస కేరళీయులు వాటిలో డిపాజిట్లు పెడుతున్నారన్నారు. విద్య, వైద్యం, ఆహారం, తదితర రంగాల్లో సహకార వ్యవస్థను అమలు చేస్తున్నామన్నారు. ఎన్ని చేసినా ప్రజల్లో మరింత మెరుగైన సౌకర్యాలు కావాలన్న అభిలాష వ్యక్తమవుతున్నదనీ, వారి ఆకాంక్షలకనుగుణంగా సర్కారు పని చేయాల్సి ఉంటుందని చెప్పారు. అశోక్ ధావులే మాట్లాడుతూ మోడీ రెండో పర్యాయం ప్రధాని అయిన తర్వాత ఎన్నడూ లేని విధంగా అతితక్కువగా పంటలకు మద్దతు ధరలు ప్రకటించారన్నారు. కేంద్ర బడ్జెట్లో రైతులు, వ్యవసాయ కార్మికులకు మేలు చేసే ఒక నిర్ణయం కూడా తీసుకోలేదని చెప్పారు. ఆదివాసీ రైతులను భూముల నుంచి వెళ్లగొట్టేందుకు అటవీ చట్టాలను సవరించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రారంభ సభా వేదికపై ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్మొల్లా, ఉపాధ్యక్షులు ఎస్ రామచంద్రన్ పిళ్లై, సారంపల్లి మల్లారెడ్డి, ఏఐఏడబ్ల్యూయూ అధ్యక్షులు తిరువనక్కరసు, ప్రధాన కార్యదర్శి విజయ రాఘవన్, ఆర్థిక వేత్త డాక్టర్ వెంకటేష్ ఆత్రేయ పాల్గొన్నారు. తొలుత ఆహ్వానసంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి స్వాగతోపన్యాసం చేయగా, ఏఐకెేఎస్ నాయకులు విజ్జు క్రిష్ణన్ అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. తెలంగాణ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు పి జంగారెడ్డి, టి సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ఉపాధ్యక్షులు బి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరా జైసింగ్, ఆనంద్ గ్రోవర్ కార్యాలయాలపై
దాడిని ఖండించిన వర్క్షాపు
సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలు ఇందిరా జైసింగ్, ఆనంద్ గ్రోవర్ కార్యాలయాలపై గురువారం సీబీఐ అధికారులు జరిపిన దాడులను ఎఐకెఎస్ వర్క్షాపు తీవ్రంగా ఖండించింది. ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న అప్రజాస్వామిక విధానాల పరంపరలోనే ఈ దాడులు జరిగాయని అభిప్రాయపడింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కోర్టుల్లో వాదిస్తున్నందునే మోడీ సర్కారు ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని విమర్శించింది. ఇద్దరు సీనియర్ న్యాయవాదులకు సంఘీభావం తెలిపింది. సీబీఐ దాడులను ఖండిస్తూ అశోక్ ధావలే ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వర్క్షాపు ఏకగ్రీవంగా అమోదించింది.
పుస్తకాల ఆవిష్కరణ
సుందరయ్య విజ్ఞాన కేంద్రం ముద్రించిన 'వ్యవసాయ సంక్షోభం ప్రత్యామ్నాయ విధానాలు ' అనే పుస్తకాన్ని ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు రామచంద్రన్ పిళ్లై ఆవిష్కరించి తొలి కాపీీని ఏఐఏడబ్ల్యూయూ అధ్యక్షులు తిరునవక్కరసుకు అందజేశారు. ఏఐకెేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా రాసిన 'ఏఐకేఎస్ చరిత్ర' పుస్తకాన్ని కేరళ మంత్రి థామస్ ఐజాక్ ఆవిష్కరించి తొలి ప్రతిని ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి విజయరాఘవన్కు ఇచ్చారు.