Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టులో బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర రెండో మహాసభ
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ రమ
నవతెలంగాణ-కంఠేశ్వర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటానికి సన్నద్ధం కావాలని బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.రమ పిలుపునిచ్చారు. ఆగస్టులో నిర్వహించనున్న యూనియన్ రాష్ట్ర రెండో మహాసభలో ఇందుకోసం కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో వచ్చే నెల 25, 26 తేదీల్లో నిర్వహించనున్న యూనియన్ రాష్ట్ర రెండో మహాసభను జయప్రదం చేయాలని కోరారు. మహాసభలో రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది ప్రతినిధులు పాల్గొననున్నట్టు తెలిపారు. అనేక పోరాటాలు నిర్వహించినప్పటికీ బీడీ కార్మికులకు కనీస వేతనాల జీవో అమలు చేయడానికి ప్రభుత్వాలు సిద్ధపడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 45 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీడీ కార్మికుల ఓట్లు కీలకం కావడంతో.. వారికి అనేక ఆశలు పెట్టి, జీవన భృతి 2016 రూపాయలు చెల్లిస్తామని ప్రకటించి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. మరోమారు అధికారం చేపట్టి ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పెంచుతామన్న పింఛన్ అమలు చేయడం లేదన్నారు. జీఎస్టీ తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం బీడీ ఇండిస్టీని దెబ్బ తీసిందని వివరించారు. ఈ సమస్యలన్నిటిపైనా రాష్ట్ర మహాసభలో చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేష్, నూర్జహాన్, నాయకులు గంగాధర్ పాల్గొన్నారు.