Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమాంతంగా పెరిగిన ధరలు
- పండ్ల విత్తనాలు రెట్టింపు
- తగ్గనున్న పంటల దిగుబడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఖరీఫ్ సీజన్ కుదేలైంది. వానలు పడకపోవడంతో కరువు పరిస్థితులు దాపురిస్తున్నాయి. నీటి కొరత, భూగర్భజలాలు అడుగంటిపోవడంతో అన్నదాతకు తిప్పలు తప్పడం లేదు. ఖరీఫ్లో మొక్కజొన్న, జొన్న, సోయాబీన్, పెసర, వేరుశనగ, వరి సాగుకు సిద్ధమైన రైతుకు అనావృష్టి దెబ్బతీసింది. జులై మొదటి వారం నుంచి నేటి వరకు 232.7 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు కావాల్సిఉంది. కానీ 152. 2 మిల్లీ మీటర్లు మాత్రమే నమోదైంది. 35 శాతం లోటు వర్షపాతం రికార్డయింది. దీని ఫలితంగా సుమారు 43 లక్షల ఎకరాల్లో వేసి పంటలు ఎండిపోయాయి. బోర్లు, బావులు, కుంటలు సైతం అడుగంటాయి. సాధారణ నీటి లభ్యతతో పండించే కూరగాయల సాగుపై దృష్టి సారించిన రైతుకు విత్త్తన ధరలు చుక్కలు చూపెడుతున్నాయి. కూరగాయల విత్తనం ధరలకు రెక్కలొచ్చాయి. పండ్ల విత్తనాలు ధరలు కూడా రెట్టింపు అయ్యాయి. టమాట, బెండ, కాకరకాయ, క్యాబేజి, క్యాప్సికం, పచ్చిమిర్చితోపాటు బొప్పాయి, కర్బుజా, వంటి పండ్ల విత్తనాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
తగ్గుతున్న దిగుబడి
జాతీయ ఉద్యానవన శాఖ లెక్కల ప్రకారం కూరగాయల దిగుబడి 2017-18లో 27.53 లక్షల టన్నులు, 2018- 19లో 27.40 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ఈరెండేండ్లలో 13 లక్షల టన్నుల కూరగాయల దిగుబడి తగ్గిపోయింది. పండ్ల దిగుబడి 2017-18లో 19.30 లక్షల టన్నుల కాగా, 2018-19లో 19.08 లక్ష టన్నుల దిగుబడి మాత్రమే అయింది. పండ్ల దిగుబడిలో 22 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అనావృష్టి పరిస్థితులు, విత్తన ధరలు పెరగడంతో కూరగాయలు, పండ్ల దిగుబడి మరింత తగ్గే అవకాశం ఉందని ఆశాఖ అధికారులు అంటున్నారు. తక్కువ నీటి లభ్యత ఉన్నప్పటికి వీటిని రకరకాల పద్దతుల్లో రైతు సాగు చేస్తారు. కూరగాయల నారు మడులు పోసే సమయం కావడంతో విత్తనాల ధరలు మండుతున్నాయి. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నది. ఒకవైపు కరువు దెబ్బ, మరోవైపు కూరగాయల విత్తనాల ధరలు విత్తుకోలేనంత దూరంలో ఉన్నాయి. కూరగాయల సాగుపై ధరల ప్రభావం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పటికే గత రెండేండ్లలో కూరగాయల దిగుబడి బాగా తగ్గింది.
బహిరంగ మార్కెట్లో ధరలు ఇలా...
టమాటా హైబ్రీడ్ రకం విత్తనాలు కిలో రూ35వేలు, రూ.40వేలు, 60వేలు, తారు రకం రూ.1లక్షా 78వేలు వరకు పలుకుతున్నాయి. హైబ్రీడ్ పచ్చిమిర్చి విత్తనాలు కిలో రూ40వేల నుంచి రూ 60వేలకు పైగా ధరలకు విక్రయిస్తున్నారు. వంకాయ కిలో రూ7వేల నుంచిరూ రూ10వేలకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. బీర, సోర, కాకర కాయ వంటి తీగ పంటలకు కిలో రూ.4వేలు, రూ 8వేలు, రూ.15వేల వరకు అమ్ముతున్నారు. పుచ్చకాయ కిలో రూ 4వేలు నుంచి రూ 6వేలు వరకు ధరలు ఉన్నాయి. థారు బొప్పాయి పేరుతో ఒక కంపెనీ బొప్పాయి విత్తనాలు కిలో లక్షా 25వేల నుంచి రూ 3.50లక్షలకు కిలో మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ విత్తనాల్లో కూడా 20శాతం వైరస్ వస్తోందని ఆరోపణలున్నాయి. కూరగాయల విత్తనాలు మార్కెట్లో 100గ్రాముల నుంచి కిలో వరకు అమ్ముతుండగా, ఆహార పంటలు కిలో నుంచి నాలుగు కిలోలు, ఐదు కిలోల చొప్పున విక్రయిస్తున్నారు.
రైతులే విత్తనాలు తయారు చేసుకోవాలి : శాస్త్రవేత్తల సలహా
రైతులు స్వయంగా విత్తనాలు పండించుకోవడం వల్ల కూడా దిగుబడి వస్తున్నదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విత్తనాల నిల్వలో మెలకువలు తెలుసుకుని సక్రమంగా వినియోగిస్తే తక్కువ ధరకే విత్తనాలు లభ్యమయ్యే అవకాశం ఉంటుందని సలహా ఇస్తున్నారు.
ప్రయివేట్ విత్తన కంపెనీల పెత్తనం
ప్రయివేట్ కంపెనీలు విత్తనాలు పండించే రైతుల నుంచి తక్కువ ధరకు విత్తనాలు సేకరించి వాటిని గ్రేడింగ్ చేసి రంగు రంగుల ప్యాకెట్లలో రూపంలో తీసుకువచ్చి ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నాయి. దీంతో విత్తనాలు పండించిన రైతులకు పెద్దగా గిట్టుబాటు కాక పోయినా మార్కెట్ చేసుకున్న కంపెనీలు కోట్లు గడిస్తున్నాయి. అసలే కాలం లేక పూర్తి స్థాయి పంటలు వేయలేని దుస్థితిలో తక్కువ రోజుల్లో పండే కూరగాయలు పండించుకుందామ నుకున్న రైతులకు చుక్కెదురవుతోంది. విత్తన రంగంలో ప్రయివేట్ కంపెనీల అధిపత్యం రోజు రోజుకు పెరగడంతో కూరగాయల విత్తనాలు ధరలు రైతులకు అందనంత ఎత్తులో ఉంటున్నాయి. కూరగాయ పంటలు టమాట, పచ్చి మిర్చి విత్తనాలతో పాటు ఆయిల్ సీడ్స్, పండ్ల విత్తనాలు ఆహార పంటల విత్తనాల ధరలు అధిక ధరలకు విక్రయి స్తున్నారు. పుచ్చకాయ, టమాటా, మిర్చి కూరగాయాలు, ఆకుకూరల విత్తనాలు కొనే పరిస్థితి లేదని రైతులు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. 1965లో విత్తన యాక్టు ప్రకారం విత్తన పంటల ఉత్పత్తి వ్యయానికి అమ్మకం వ్యయానికి 35నుంచి 40శాతం ధరలు మాత్రమే ఉండాలి. కానీ కొన్ని ప్రయివేట్ కంపెనీలు ఇష్టానుసారంగా పెంచుతూ పోతున్నాయి. ధరలను నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతుండటంతో ప్రయివేట్ కంపెనీలు ఇష్టారాజ్యంగా రైతుల నుంచి వసూళ్లుకు తెగబడ్డాయని విమర్శలు వస్తున్నాయి.