Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ ఔషధ కంపెనీలను బ్లాక్లిస్టులో చేర్చాలి :
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
డీజీ నర్సింహారావు
- ఈఎస్ఐ డైరెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ - సిటీబ్యూరో
ఈఎస్ఐ డైరెక్టరేట్లో జరిగిన వందల కోట్ల కుంభకోణానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏంటని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహారావు అన్నారు. సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఈఎస్ఐ డైరెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా డీజీ మాట్లాడుతూ.. 2015-18 మధ్య సుమారు రూ.450కోట్ల అవినీతి జరిగిందని, ఈ విషయంలో సంబంధిత బాధ్యులపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని అన్నారు. జీఓనెం.51కు విరుద్ధంగా టెండర్లను పక్కనబెట్టి తమ బినామీ కంపెనీల నుంచి మందులు కొనుగోలు చేశారని విమర్శించారు. వేలకోట్ల రూపాయల అవినీతి, నిబంధనల ఉల్లంఘన, మందుల కొనుగోళ్లలో గోల్మాల్ వాస్తవమేనని ఏసీబీ విచారణలోనూ తేలిందన్నారు. డైరెక్టర్తోపాటు జాయింట్ డైరెక్టర్ను బాధ్యులను చేస్తూ గత డిసెంబర్లో నోటీసులు జారీ చేశారని గుర్తుచేశారు. ఆరు నెలలు గడుస్తున్నా బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ.. కార్మికుల సొమ్మును ఉన్నతాధికారులు మందుల కంపెనీలతో కుమ్మక్కై దోచుకుంటున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్నారు. మూడేండ్లుగా వివిధ వైద్య పరీక్షల కోసం కొనుగోలు చేసిన కిట్స్, యంత్ర పరికరాలు, మందుల కోసం కంపెనీలతో అధికారులు కుమ్మక్కయిన ఉదంతాలు అనేకం వెలుగు చూస్తున్నాయని చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించిన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవడం తోపాటు వారి నుంచి సొమ్మును రాబట్టాలని డిమాండ్ చేశారు. కొనుగోళ్లలో భాగస్వాములైన ఔషధ కంపెనీలను బ్లాక్ లిస్టులో చేర్చి కేసులు నమోదు చేయాలన్నారు. ఈ ధర్నాలో సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాస్రావు, వెంకటేశ్, దశరథ్, నగర కమిటీ సభ్యులు ఈశ్వరరావు, కామేష్బాబు, మహేందర్ పాల్గొన్నారు.