Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్తంగా 21నగరాల్లో తాగునీటి కరువు
- నగర పాలకులకు 'రియల్ ఎస్టేట్' వ్యాపారుల ప్రయోజనాలే ముఖ్యం
- నీటి పరిరక్షణ గాలికి వదిలేసి..
ప్రజలకు పాఠాలు
చెన్నై నీటి కష్టాలు, అక్కడ సామాన్య ప్రజలు పడుతున్నపాట్లు...అన్నీ ఇన్నీ కావు. పక్కనే సముద్రం ఉంది. కానీ దాహం తీరదు. సామాన్యుల పనులు ముందుకు కదలవు. దీనికితోడు పాలకుల్లో పట్టించుకునే నాథుడు లేడు. వెరసి చెన్నై నగరవాసికి నిన్నటి వేసవికాలం చుక్కలు చూపించింది. అయితే ఈ పరిస్థితి కేవలం చెన్నైకు మాత్రమే పరిమితం కాదనీ, హైదరాబాద్, ఢిల్లీ, బెంగుళూరు, గురుగావ్, ఫరీదాబాద్...మొదలైన 21నగరాలు ఈ ప్రమాదం అంచున ఉన్నాయనీ స్వయంగా 'నిటి ఆయోగ్' లెక్కతేల్చింది.
న్యూఢిల్లీ రెండేండ్ల క్రితం దక్షిణాఫ్రికా నగరంలో 'కేప్ టౌన్'లో తీవ్రమైన నీటి కరువు ఏర్పడింది. ప్రజలంతా తాగునీరు లేక అల్లాడిపోయారు. ప్రభుత్వం పోలీసు బలగాల మధ్య ప్రజలకు 'రేషన్ పద్ధతి'లో తాగునీరును అందించాల్సి వచ్చింది. వర్షాలు లేక భూగర్భజలాలు పడిపోవటం, వరుసగా కరువు పరిస్థితులు ఏర్పడటం 'కేప్ టౌన్'లో భయానక నీటి కరువుకు దారితీసింది. ఆనాడు ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలన వార్త. ఆ భయానక కరువు ఛాయలు ఎక్కడో ఆఫ్రికా ఖండంలో కాదు...ఇప్పుడు భారత్లోని వివిధ నగరాల్లో కనిపిస్తున్నాయి. నిన్నటి వేసవికాలంలో చెన్నై ప్రజలు ఎదుర్కొన్న పరిస్థితి అందర్నీ ఆలోచింపజేస్తోంది. చైన్నైలాగా...దాదాపు 21 నగరాల్లో భూగర్భజలాలు పడిపోయి 2020నాటికి తీవ్రమైన నీటి ఎద్డడి ఏర్పడుతుందని 'నిటి ఆయోగ్' అంచనావేస్తోంది.
వివిధ నగరాల్లో భూగర్భజలాలు అడుగంటుతున్న విషయం మనకు తెలిసిందే. ఇది 2019లో తెలిసిన విషయం కాదు కదా! ఎన్నో ఏండ్ల క్రితమే ఈ ప్రమాదాన్ని ఊహించాం. అయితే ఈ సమస్యను ఎదుర్కొనే విషయంపై ప్రభుత్వాలు కదలటం లేదు. నీటి సంరక్షణపై ప్రభుత్వాలు, పాలకులు ప్రజలకే పాఠాలు చెబుతున్నాయి. కానీ, విధానపరంగా ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలేంటో ఇంతవరకూ తెలియదు. నీటి పరిరక్షణపై 'మన్ కీ బాత్'లో ప్రధాని మోడీ ప్రస్తావించి వదిలేశారు. దేశంలోని ప్రతీ ఒక్క పౌరుడికి తాగునీటి వసతి కల్పిస్తామన్న మాటే వినబడలేదు.
ఇది...మూడోతరం కరువు
భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడం, వర్షాలు సరిగా కురవక...నదులు, చెరువులు, కుంటలు ఎండిపోవటం సర్వసాధారణం అన్నట్టుగా మారింది. అనేక నగరాల్లో ఇప్పుడు 400 అడుగుల లోతున బోరు వేస్తున్నా నీరుపడే పరిస్థితి అనుమానమే. రాజస్థాన్లోని 'సికర్' జిల్లాలో ఎక్కడా కూడా భూమిలో నీటి ఛాయలే లేవు. శాస్త్రవేత్తలు దీనిని 'మూడో తరం కరువు'గా పిలుస్తున్నారు.
రుతుపవనాల గమనంలో ప్రతీఏటా అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. గత 18 ఏండ్ల గణాంకాల్ని పరిశీలిస్తే, 13 సంవత్సరాలు లోటు వర్షపాతం నమోదైంది. ఇది అనూహ్యమైన అంశం కాదు. అసలు సమస్య ఏంటంటే, కొద్ది గంటల్లో భారీ వర్షాలు కురిసి వెళ్లిపోతున్నాయి. ఉదాహరణకు ఢిల్లీ, బొంబాయి నగరంలో కురుస్తున్న వర్షాలు. ఇలాంటి వర్షాలతో నీరు భూమిలో ఇంకటం లేదు. సీజన్లో తరుచూ వర్షాలు పడుతూ, భారీ వర్షాలు నమోదైతే...ఇటు వ్యవసాయానికి, అటు నగర ప్రజలకు ఉపయోగపడుతుంది.
నగర పాలకుల దృష్టంతా రియల్ ఎస్టేట్పైనే..
నగరాల్లో జనాభా పెరుగుతోంది. దీంతో నీటి అవసరాలు పెరుగుతున్నాయి. కాంక్రిట్ జంగల్ పెరగటంతో నీరు ఇంకే పరిస్థితి లేదు. ఢిల్లీలో కురిసిన వర్షంలో కేవలం 30 శాతం పరిరక్షించుకున్నా...ప్రజల అవసరాలు తీరుతాయని నీటి రంగ నిపుణుడు హిమాంశుఠాకూర్ చెబుతున్నారు. ఎక్కడో వందల కి.మీ దూరంలో ఉన్న హిమాచల్ప్రదేశ్లోని రేణుకా డ్యామ్ నుంచి రూ.4,500కోట్లు ఖర్చుచేసి ఢిల్లీ ప్రభుత్వం నీటిని తెప్పిస్తోంది.
నగరాల్లో నీటి కష్టాలకు మరో కారణం 'రియల్ ఎస్టేట్' వ్యాపారం, అక్కడి నగరపాలక మండలి. ఢిల్లీ, ముంబయి, చెన్నై, కొచి, గురుగావ్, హైదరాబాద్ నగరాల్లో పాలకమండళ్లు అభివృద్ధి అంటే కేవలం రియల్ఎస్టేట్ ఎదగటమనే భావనలో ఉన్నాయి. రియల్ఎస్టేట్ వ్యాపారస్తుల ప్రయోజనాలు తప్ప మిగతావి కనిపించటం లేదు.