Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కొక్కరి నుంచి రూ.4 లక్షల వరకు వసూలు
- పాఠశాల విద్యలో పైరవీల జోరు
- దొడ్డిదారిన 15 మంది ఉపాధ్యాయుల బదిలీలు
- ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే సిఫారసు
- నిషేధం ఉత్తర్వులు బుట్టదాఖలు
- రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీ దొడ్డిదారిన యధేచ్చగా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు దొడ్డిదారిన యధేచ్చగా జరుగుతున్నాయి. పాఠశాల విద్యాశాఖలో పైరవీల జోరు సాగుతున్నది. నిషేధం ఉత్తర్వులున్నా పైసలుంటే ఈ ప్రభుత్వంలో ఇట్టే పని పూర్తవుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయం దొడ్డిదారి బదిలీలకు కేంద్రంగా ఉండడం పలు విమర్శలకు తావిస్తున్నది. గుట్టుచప్పుడు కాకుండా 15 మంది ఉపాధ్యాయుల బదిలీలను ఈ ప్రభుత్వం చేయడమే అవినీతికి తార్కాణం. మరో 200 మంది బదిలీల దస్త్రాలు తయారైనట్టు విశ్వసనీయ సమాచారం. ఈ బదిలీలకు ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలిసింది. పైసలు కొట్టు... బదిలీ ఉత్తర్వు పట్టు అన్న చందంగా దొడ్డిదారి బదిలీల వ్యాపారం సాగుతున్నది. అయితే పైకి మాత్రం మానవతా దృక్పథం, అనారోగ్యం, ఇతర సమస్యలున్నాయని చెప్పడం గమనార్హం. నిర్మల్ నుంచి ఆదిలాబాద్కు, కొత్తగూడెం నుంచి రంగారెడ్డికి, జగిత్యాల నుంచి కరీంనగర్కు, సిరిసిల్ల జిల్లాలో అంతర్గత బదిలీలు జరిగాయి. అయితే ఉత్తర్వులు ఎక్కడా బయటికి కనిపించకుండా అధికారులు, ఆ ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకున్నారు. బదిలీ అయి పాఠశాలల్లో చేరేంత వరకు ఎవరికీ తెలియకుండా అత్యంత రహస్యం పాటిస్తున్నారు. అవినీతికి తావుండదని, పారదర్శకత పాటించడమే తమ విధానమని పదేపదే ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు వ్యాఖ్యలు కాగితాలకే పరిమితమని ఈ బదిలీలను చూస్తే అర్థమవుతుంది. ఉపాధ్యాయ బదిలీలపై రాష్ట్రంలో నిషేధం ఉన్నది. కానీ ముఖ్యమంత్రి కార్యాలయమే ఆ నిబంధనలను బుట్టదాఖలు చేస్తున్నది. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కార్యాలయంతో సన్నిహితంగా ఉండేవారు ఈ తతంగం నిర్వహిస్తున్నారు. బదిలీకి ఇంత అని రేటు మాట్లాడుకొని చేస్తుండడం గమనార్హం. పైరవీలకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో అర్థమవుతున్నది. కోరుకున్న చోటు కావాలంటే విద్యార్హతలు, పనితీరు, బోధన వంటి పరిగణనలోకి తీసుకోకుండా పైసలను ప్రామాణికంగా తీసుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ ప్రభుత్వంలో అయినా మానవతా దృక్పథంతో బదిలీలు చేయడం సర్వసాధారణమని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. పారదర్శకంగా బదిలీలు జరిగే విధానాన్ని ప్రభుత్వమే అపహాస్యం చేస్తున్నది. అయితే అంతర్జిల్లా బదిలీలు చేపట్టాలని ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి. దొడ్డిదారి బదిలీలకు అనుమతి ఇస్తున్న ప్రభుత్వం అంతర్జిల్లా బదిలీలను మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దొడ్డిదారి బదిలీలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ బదిలీల ఉత్తర్వులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
దొడ్డిదారి బదిలీలు అన్యాయం : యూఎస్పీసీ
రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో దొడ్డిదారిలో ఉపాధ్యాయుల బదిలీలు జరగడం అన్యాయమని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) విమర్శించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బి జనార్ధన్రెడ్డిని మంగళవారం యూఎస్పీసీ ప్రతినిధులు చావ రవి, వై అశోక్కుమార్, మైస శ్రీనివాసులు, ఎం రఘుశంకర్రెడ్డి, టి లింగారెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. పారదర్శక కౌన్సెలింగ్ విధానాన్ని అపహాస్యం చేస్తూ ప్రభుత్వమే నేరుగా బదిలీలు చేయడాన్ని ఖండించారు. రాష్ట్రంలో 400 మంది ఉపాధ్యాయులు అంతర్జిల్లా బదిలీల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఐదేండ్లుగా మంత్రులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. పైరవీ చేసే వారికే బదిలీలను రహస్యంగా చేయడం సరైంది కాదని తెలిపారు. ఈ పైరవీ బదిలీలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అర్హత ఉన్న అందరికీ అంతర్జిల్లా బదిలీలకు అవకాశం కల్పించాలని కోరారు. అందుకు అనుగుణంగా నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. జనార్ధన్రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. సీఎం కార్యాలయం ఆదేశాలతో పరిమితంగా బదిలీలు చేశామని అంగీకరించారు. అవసరమైన వారికి అంతర్జిల్లా బదిలీలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
అక్రమ బదిలీలు ఉపసంహరించాలి : ఎస్టీయూ
అక్రమ బదిలీలను వెంటనే ఉపసంహరించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) అధ్యక్షులు బి భుజంగరావు, ప్రధాన కార్యదర్శి జి సదానందంగౌడ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరును ఖండిస్తున్నామని తెలిపారు. ఈ బదిలీలను వెనక్కి తీసుకోకపోతే ఉపాధ్యాయులను కదిలించి ప్రభుత్వ తీరును ఎండగడతామని హెచ్చరించారు.
ఈ బదిలీలు రద్దు చేయాలి : టీఎస్పీటీఏ
పారదర్శకమైన కౌన్సెలింగ్ విధానానికి తూట్లు పొడిచి దొడ్డిదారిలో చేసిన ఉపాధ్యాయ బదిలీలను రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్పీటీఏ) అధ్యక్షులు షౌకత్అలీ, ఎన్ చెన్నరాములు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ బదిలీల వల్ల ప్రతిభకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. కౌన్సెలింగ్ ద్వారా సీనియర్ ఉపాధ్యాయులకు దక్కాల్సిన ఈ ఖాళీలను అక్రమంగా భర్తీ చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. బదిలీలను రద్దు చేయకపోతే చట్టపరమైన పోరాటం చేస్తామని తెలిపారు.
పలుకుబడి బదిలీలు ఆపాలి : ఉపాధ్యాయ సంఘాలు
రాష్ట్రంలో పలుకుబడి బదిలీలను ఆపాలని టీటీఎఫ్, టీడీటీఎఫ్,ఆటా, బీసీటీఏ,టీఎస్టీటీఎఫ్, టీఎస్టీడబ్ల్యూటీయూ, టీడబ్ల్యూటీఎఫ్ నేతలు రఘునందన్, రాజేందర్, జయబాబు, కృష్ణుడు, డివి రావు, లక్ష్మణ్నాయక్, మల్లీశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అంతర్జిల్లా బదిలీలకు అవకాశం కల్పించి షెడ్యూల్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.