Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వంద ఎకరాల్లో మొలకెత్తని క్యారెట్ విత్తనం
నవతెలంగాణ-షాబాద్
నకిలీ విత్తనాలు అన్నదాతలను నట్టేట ముంచాయి. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి ఎన్నో ఆశలతో క్యారెట్ విత్తనాలు కొనుగోలు చేసి సాగుచేస్తే, విత్తనం మొలకెత్తలేదు. సుమారు వంద ఎకరాల్లో 41 మంది రైతులు సాగు చేశారు. సుమారు రూ.50లక్షల నష్టం వాటిల్లినట్టు రైతులు వాపోతున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం లక్ష్మరావుగూడలో జరిగింది. తాము నకిలీ విత్తనాలతో నష్టపోయామని ఉద్యానవన, వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. మండల పరిధిలోని నాగర్గూడ గ్రామంలోని వివిధ కంపెనీల డీలర్ల నుంచి క్యారెట్ విత్తనాలను లక్ష్మరావుగూడ, ఏట్లఎర్రవల్లి, తిర్మలాపూర్, ఎర్రోనిగూడ, మక్తగూడ తదితర గ్రామాల రైతులు కొనుగొలు చేశారు. సుమారు 100 ఎకరాల్లో ఎక్కడా విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో మరో కంపెనీకి చెందిన క్యారెట్ విత్తనాన్ని సాగుచేస్తే మంచిగా మొలకెత్తాయి. దీంతో నకిలీ విత్తనాలతో పూర్తిగా నష్టపోయామని గుర్తించిన రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఏడీ సంజరుకుమార్, వ్యవసాయ శాస్త్రవేత్త ప్రవీణ్కుమార్ రైతులు సాగుచేసిన నష్టపోయిన పొలాలను పరిశీలించారు.