Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ బ్యాంకులపై కార్పొరేట్ శక్తుల దుష్ప్రచారం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ రంగ బ్యాంకులు..దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలు. 2008 సంక్షోభంతో చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయినా...మన దేశాన్ని కాపాడింది అవే. లాభాపేక్షే ధ్యేయంగా ప్రయివేటు బ్యాంకులు పనిచేస్తుంటే...వ్యవసాయ, చిన్న,మధ్యతరహా పరిశ్రమలకు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రుణాలిస్తూ గ్రామీణాభివృద్ధికి ఊతమిస్తున్నాయి. వాటినే నేటి పాలకులు ప్రయివేటుపరం చేసేందుకు పావులు కదుపుతున్నారు. కార్పొరేట్ శక్తుల ఒత్తిడి మేరకు మోడీ సర్కారు ప్రభుత్వ బ్యాంకుల నిర్వీర్యానికి వేగంగా పావులు కదుపుతున్నది. 50 ఏండ్ల కింద జాతీయకరణ చేసిన బ్యాంకులను ప్రయివేటు పరం చేసి ఆనాటి ఆశయాలకు తూట్లు పొడవాలని చూస్తున్నది. ఈ పరిస్థితుల్లో బ్యాంకు ఉద్యోగులు, ప్రజలు ఐక్యంగా పోరాడి ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వ రంగ సంస్థలపై దుష్ప్రచారం
ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కార్పొరేట్ మొండిబాకీలు. వాటి వసూలు కోసం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ముందడుగు వేయాలి. కానీ, ఆ వైపుగా ప్రయత్నాలు లేకపోగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల నిర్వీర్యానికి మోడీ సర్కారు పూనుకుంటున్నది. మౌలిక రంగాలకు దీర్ఘకాలిక నిధులు సమకూర్చాల్సిన ఐడీబీఐ, ఎస్ఐడీబీఐ, హెచ్డీబీ, నాబార్డు, తదితర సంస్థలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆర్థిక సంస్కరణల తర్వాత అవి సాధారణ బ్యాంకుల స్థాయికి నెట్టివేయబడ్డాయి. కొన్ని ప్రయివేటుపరం చేయబడ్డాయి. పబ్లిక్, ప్రయివేటు భాగస్వామ్యంలో ఏర్పాటు చేసే కంపెనీలకు రుణాలివ్వాలని ప్రభుత్వ బ్యాంకులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాయి. దీంతో ప్రయివేటు కంపెనీలు సొంత పెట్టుబడి పెట్టడం మానేసి బ్యాంకుల రుణాల మీద ఆధారపడి లాభాలను పోగేసుకోవడం మొదలుపెట్టాయి. అనంతరం రుణాలను ఎగ్గొట్టడం ప్రారంభించాయి. ఆ మొండి బకాయిలే ప్రభు త్వ బ్యాంకుల నష్టాలకు కారణమవుతున్నాయి. ఐదేండ్లలో 4 లక్షల 30 వేల కోట్ల రూపాయల కార్పొరేట్ రుణాల రద్దుకు మోడీ సర్కారు అవకాశం కల్పించింది. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చెప్పినా, సుప్రీం కోర్టు చివాట్లు పెట్టినా మొండి బాకీలున్న కార్పొరేట్ కంపెనీల పేర్లనుగానీ, బ్యాంకుల రుణాల మాఫీలో లబ్ది పొందిన కార్పొరేట్ రాబందుల పేర్లను ప్రకటించడానికిగానీ ప్రభుత్వం ముందుకు రాలేదు. పైగా, ప్రభుత్వానికి తొత్తులుగా మారిన కొందరు ఆర్థిక వేత్తలు, ప్రభుత్వ బ్యాంకులకు రుణాలను ఎగ్గొట్టిన కార్పొరేట్ యజమానులు నష్టాల నివారణకు బ్యాంకుల ప్రయివేటీకరణే మార్గమని విషప్రచారానికి పూనుకున్నాయి.
ప్రభుత్వ బ్యాంకులను కాపాడాలి..జాతీయకరణ ఆశయాలను కొనసాగించాలి
పి.వెంకట రామయ్య, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి
ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రజల డిపాజిట్లకు భద్రతనిచ్చినవి ప్రభుత్వ రంగ బ్యాంకులే. ప్రజాసంక్షేమానికి, దేశ ఆర్థిక పురోగతి కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులను విస్తరించాలి. విలీనాల పేరిట ప్రభుత్వ బ్యాంకులను కుదించటాన్ని వ్యతిరేకిస్తున్నాం. సంస్కరణల పేరుతో బ్యాంకుల ప్రయివేటీకరణ ప్రయత్నాలను తిప్పికొడతాం. బ్యాంకు ఖాతాదారులకు, ప్రజానీకానికి సంస్కరణల వల్ల కలుగుతున్న నష్టాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రభుత్వ బ్యాంకులను కాపాడుకుంటూ 50 ఏండ్ల కింద బ్యాంకుల జాతీయీకరణ సందర్భంగా నిర్దేశించుకున్న ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం.