Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
- బోధనా వైద్యుల ఉద్యోగ విరమణ వయసు పెంపు
- రైతు రుణ విమోచన కమిషన్ చైర్మెన్ నియామకం,
- పంచాయతీరాజ్ బిల్లులకూ ఓకే
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మున్సిపాల్టీల్లో వార్డుల సంఖ్యను ఖరారు చేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన బిల్లుకు శాసనసభ గురువారం ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలను ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతోనే ఈ బిల్లును తీసుకొచ్చామన్నారు. వీటి అభివృద్ధికి రూ.2,074 కోట్లు వెచ్చిస్తామని సీఎం తెలిపారు. వైద్య కళాశాలల్లో బోధనా వైద్యుల ఉద్యోగ విరమణ వయసు పెంపునకు (58 నుంచి 65 యేండ్లకు) సంబంధించిన బిల్లును కూడా సీఎం ప్రవేశపెట్టారు. దీనికి కూడా అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. దీంతోపాటు రైతు రుణ విమోచన కమిషన్ చైర్మెన్ నియామకానికి సంబంధించిన బిల్లుకు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకూ సభ ఆమోదం తెలిపింది. వీటిలో రుణ విమోచన కమిషన్ చైర్మెన్ బిల్లుపై కాంగ్రెస్, ఎంఐఎం అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ కమిషన్కు చైర్మెన్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తినే నియమించాలని ఆయా పక్షాల నేతలు భట్టి విక్రమార్క, అక్బరుద్దీన్ ఓవైసీ కోరారు.
పోస్టులను త్వరితగతిన భర్తీ చేయండి...
బోధనా వైద్యుల ఉద్యోగ విరమణ వయసు పెంపుపై భట్టి మాట్లాడుతూ.. ఈ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతునిస్తున్నదని తెలిపారు. అయితే ఇప్పటికే ఎంబీబీఎస్, పీజీ పూర్తి చేసిన వారు వైద్య పోస్టుల నియామకాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. అందువల్ల త్వరితగతిన వైద్య కళాశాలల్లో ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే వారు తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనవుతారని చెప్పారు. అక్బరుద్దీన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి రూ.1500 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనాలు కట్టిస్తామంటూ సీఎం గతంలో చెప్పారని గుర్తుచేశారు. కానీ ఇప్పటి వరకూ ఆ ఊసే లేదని అన్నారు. వైద్య విద్య, అందుకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించేందుకు వీలుగా ప్రభుత్వ, ప్రయివేటు వైద్య కళాశాలలతో ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని నిర్వహించాలని కోరారు.
వేటిని ఉంచాలో.. వేటిని తీసేయాలో
మాకు తెలుసు : సీఎం
సభ్యుల ప్రశ్నలకు సీఎం కేసీఆర్ జవాబిస్తూ... వైద్య విద్యనభ్యసించిన నిరుద్యోగ యువతకు ఎలాంటి నష్టం లేకుండా పోస్టులను భర్తీ చేస్తామని హామీనిచ్చారు. కళాశాలల ప్రతినిధులతో వెంటనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ వైద్యశాఖ మంత్రికి సూచించారు. అవసరమైతే తానూ ఆ సమావేశంలో పాల్గొంటానని చెప్పారు. ఉస్మానియా దవాఖానాపై తమకూ శ్రద్ధ ఉందని చెప్పారు. ఆ ఆస్పత్రి కోసం రూ.25 కోట్లు కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో మొత్తం 2,803 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులుండగా.. వాటిలో ప్రస్తుతం 1,424 మందే ఉన్నారని తెలిపారు. 1,379 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో వారసత్వ కట్టడాల విషయమనేది ఒక జోక్లాగా మారిందని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అలాంటి కట్టడాలను తాము గౌరవిస్తాం, గుర్తిస్తామని తెలిపారు. వాటి పరిరక్షణ కోసం ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తామని, అందుకోసం ఒక నిపుణుల కమిటీని నియమిస్తామని వివరించారు. ఏయే కట్టడాలను ఉంచాలి..? ఏయే కట్టడాలను తీసేయాలనే విషయమై తమ ప్రభుత్వానికి స్పష్టత ఉందన్నారు. ఇదే సమయంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కొన్నింటిని కూల్చి వేయాల్సిందేనని చెప్పారు.
నేటికి వాయిదా...
బిల్లుల ఆమోదం అనంతరం సభను శుక్రవాకరానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సభలో.. నూతన మున్సిపల్ చట్టాన్ని ఆమోదించనున్నారు.