Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 33 శాతం యథాతధంగా కొనసాగించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీలో మున్సిపల్ బిల్లును ప్రవేశపెట్టారని తెలిపారు. ఇందులో బీసీలకు రిజర్వేషన్లు తగ్గించే అవకాశముందని పేర్కొన్నారు. రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చ జరగాలని కోరారు. గతంలో ఉన్నట్టుగానే 33 శాతం రిజర్వేషన్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఏబీసీడీఈలుగా వర్గీకరణ చేయాలని కోరారు. రిజర్వేషన్లను 50 శాతానికి మించకుండా వుండాలనే పేరుతో బీసీలకు తగ్గించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని తెలిపారు. సామాజిక న్యాయం కోసం పనిచేస్తామని చెప్తున్న ప్రభుత్వం ఆచరణలో అన్యాయం చేస్తోందని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పు సాకుగా చూపిస్తూ రిజర్వేషన్లు తగ్గించాలని యోచిస్తోందని తెలిపారు. ఇలా తగ్గించడమంటే సామాజిక న్యాయానికి తూట్లు పొడిచినట్టేనని పేర్కొన్నారు. తమిళనాడులో 60 శాతానికిపైగా రిజర్వేషన్లను అక్కడి ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో బీసీలకు అన్యాయం జరగకుండా గతంలో ఉన్నట్టు 33 శాతం రిజర్వేషన్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశం మేరకు ఏబీసీడీఈ వర్గీకరణ చేయాలని కోరారు.