Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మెదక్
సాగులోని అసైన్డ్ భూములను పట్టాలున్న తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్పల్లి దళితులు గురువారం ఆందోళన చేశారు. మెదక్-బొడ్మట్పల్లి ప్రధాన రహదారిని సుమారు 400 మంది దిగ్బంధించారు. ఈ సందర్భంగా నలువురు మాట్లాడుతూ.. పొడ్చన్పల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 1168/29లో 498 ఎకరాల 28 గుంటల ప్రభుత్వ భూమి ఉందని చెప్పారు. ఇందులో సుమారు 72మందికి 1970, 84, 2003, 2009 సంవత్సరాల్లో దశల వారీగా ప్రభుత్వం కేటాయించినట్టు చెప్పారు. అప్పటి నుంచి వ్యవసాయం చేశామని తెలిపారు. కాలక్రమంలో ఆ భూములను స్థానికేతరులు ఆక్రమించుకున్నారని వాపోయారు. ఈ భూములకు ఫైనల్ పట్టా సర్టిఫికెట్లు పొందిన తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై తహసీల్దార్కు 1975-76 నుంచి నేటి వరకు ప్రతి ఏడాదికి సంబంధించిన పత్రాలు, 1989-90కు సంబంధించిన ఆర్ఓఆర్ ప్రతులను అందజేసినట్టు చెప్పారు. పట్టాలు కలిగి ఉన్న తమను ప్రస్తుతం స్థానికేతరులు ఆ భూముల్లోకి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ భూముల్లో కొందరు గ్రామస్తులతో పాటు ఇతర గ్రామాలకు చెందిన వారు సాగు చేసుకుంటున్నారని చెప్పారు. అక్కడ ఇటుక బట్టీలు కూడా ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఇదేమని అడిగితే తమపై దౌర్జన్యానికి దిగుతున్నారన్నారు. ఇప్పటికే వందలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయని, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దళితులకు కేటాయించాలని కోరారు. ఈ విషయమై గతంలో పాపన్నపేట్ తహసీల్దార్కు విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పూర్తి ఆధారాలు అందజేసినా రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.