Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువజన సమ్మేళనంలో తమ్మినేని
నవతెలంగాణ- ఖమ్మం ప్రతినిధి
దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని, అందుకు పాలకుల విధానాలతో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోవడం కూడా ఒక కారణమేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏటా కోటి ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగ యువత ఓట్లతో గద్దెనెక్కిన మోడీ మాట తప్పారని విమర్శించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబా బాద్ జిల్లాల స్థాయి యువజన సమ్మేళనం ఖమ్మంలోని రామకృష్ణ ఫంక్షన్ హాల్లో గురువారం జరిగింది. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.సాం బశివ అధ్యక్షత వహించిన సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. గడిచిన ఐదేండ్ల లో ఐదు కోట్ల ఉద్యోగాలివ్వాల్సి ఉండగా ఆ ఊసే లేదన్నారు. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు వల్ల పరిశ్రమల్లో పనిచేస్తున్న సుమారు కోటీ 80లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి బజారున పడ్డారన్నారు. మరోవైపు వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందన్నారు. దేశంలో మతసామరస్యం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇలా ఎన్నో రకాలుగా మోడీ తన పాలనలో దేశాన్ని భ్రష్టుపట్టించారని విమర్శించారు. ఇంతజేసినా బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడానికి సెంటిమెంట్, భావోద్వేగ పూరిత విషయాలను, ఉద్రేకపూరితమైన ఆలోచనలను పురిగొల్పి, ప్రజల్లో హిందూభావజాలాన్ని జొప్పించడమే కారణమన్నారు. తెలంగాణలో కేసీఆర్ గెలుపు కూడా అలా సెంటిమెంటుతో వచ్చిందేనని చెప్పారు. పశ్చిమబెంగాల్, ఏపీ, కర్నాటక, తెలంగాణలో తనకు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని మోడీ ఫిరాయింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని చెప్పారు. చట్టాలను పరిరక్షించాల్సిన స్థానంలో ఉన్న ప్రధాని మోడీ ఆ చట్టాలను నీరుగార్చేలా వ్యవహరించడం సరికాదన్నారు. అందుకే యువతకు రాజకీయాల్లో వాస్తవాలను వెల్లడించి వారిలో చైతన్యాన్ని నింపాలన్నారు. ఎర్రజెండా వైపు, ఉద్యమాల వైపు మళ్లించాల న్నారు.. పేదల కన్నీళ్లు తుడవడానికి, వారి పక్షాన పోరాటాలు, ఉద్యమాలు చేయడానికి ఎర్రజెండా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేశ్వర రావు, ఏజే రమేష్, ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల కార్యదర్శు లు నున్నా నాగేశ్వరరావు, అన్నవరపు కనకయ్య, సాదుల శ్రీను, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజరు, విప్లవ్కుమార్, సోషల్ మీడియా రాష్ట్ర ఇన్చార్జి జగదీష్, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.