Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యాక్సిన్ వికటించడం వల్లేనని బంధువుల ఆగ్రహం
నవతెలంగాణ- కొణిజర్ల
ఆరేండ్ల నిరీక్షణ తర్వాత పుట్టిన కొడుకు మృతి మృతిచెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలోని సింగరాయపాలెంలో గురువారం జరిగింది. వ్యాక్సిన్ వికటించడం వల్లే ఇలా జరిగిందని బాధితులు అంటుండగా, పోస్టుమార్టం చేస్తే విషయం తెలుస్తుందని డాక్టర్లు అంటున్నారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతనబోయిన రాజా- నాగరాణి దంపతులకు ఒక పాప తర్వాత ఆరేండ్లకు బాబు జన్మించాడు. బుధవారం నాటికి బాబుకు మూడు నెలల 24 రోజులు. స్థానిక హెల్త్ సబ్ సెంటర్లో పెంటావ్యాలెంట్ వ్యాక్సిన్ వేయించారు. అదేరోజు సాయంత్రం బాబుకు జ్వరం రావడంతో జ్వరం మందు తాగించారు. అర్ధరాత్రి మరోసారి జ్వరం రావడంతో తడిగుడ్డతో తుడిచి పాలు పట్టించారు. ఆ తర్వాత కొద్ది సేపటికే బాబులో కదలికలు లేకపోవడంతో స్థానికంగా ఉన్న వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. వారు వెంటనే వైరాలోని ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ వైద్యులు పరీక్షించి బాబు అప్పటికే మృతిచెందాడని చెప్పారు. వెంటనే ఆరోజు వ్యాక్సిన్ వేసిన ఆశా వర్కర్ల వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పగా, వారు ఏఎన్ఎంల దృష్టికి తీసుకెళ్లారు. బాలుడు మతిచెందిన విషయాన్ని మండల ప్రభుత్వ వైద్యాధికారి బాలకృష్ణకు, జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు విచారణకు రాగా, వ్యాక్సిన్ వికటించడం వల్లే బాబు మృతిచెందాడనీ, తమకు న్యాయం చేయాలనీ బాధితులు వారిని కోరారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ జి.అలివేలు మాట్లాడుతూ.. ఆ బాలునితోపాటు అదే గ్రామంలోని మరో బాబుకి కూడా వ్యాక్సిన్ వేశారనీ, అతను బాగానే ఉన్నాడనీ చెప్పారు. పోస్టుమార్టం చేస్తే వ్యాక్సిన్ వల్ల చనిపోయాడా.. మరేదైనా కారణం ఉందా అనేది తెలుస్తుందని అలివేలు చెప్పారు. వ్యాక్సిన్ వల్ల చనిపోతే సంబంధింత వ్యక్తులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో కుటుంబ సభ్యులు బాలుని మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు అంగీకరించారు.