Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాజెక్టు కెనాల్ ద్వారా నీరందించాలని డిమాండ్
నవతెలంగాణ- రేగొండ
సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి పరిధి పోలీస్ చెక్పోస్టు వద్ద కెనాల్ బ్రిడ్జిపై గురువారం ధర్నా చేశారు. కొప్పుల ప్రాజెక్టు కెనాల్ ద్వారా కొప్పుల నుంచి దిగువ 14గ్రామాలకు సాగునీరు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కొప్పుల ప్రాజెక్టులో సాగుకు సరిపడే నీళ్లు ఉన్నప్పటికీ వర్షాభావ పరిస్థితుల వల్ల నీరు ఇవ్వలేమని స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి చెబుతున్నారని అన్నారు. దానివల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని నిరసిస్తూ ఈ ఆందోళనకు దిగామని చెప్పారు. విషయం తెలుసుకున్న సీఐ ఎస్.శ్రీనివాస్, ఎస్ఐ సధాకర్ ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడినా ఆందోళన వివరమించేందుకు ససేమిరా అన్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రైతులతో ఫోన్లో మాట్లాడి నీరు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రెండు రోజుల్లో నీరు అందించకపోతే నిరాహార దీక్షకు దిగుతామని రైతులు హెచ్చరించారు.