Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రశ్న
- విద్యాశాఖ కమిషరేట్ వద్ద ఎస్సీఎస్టీయూఎస్ ధర్నా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రోస్టర్ కమ్ మెరిట్ పాటించకుండా టీఆర్టీ నియామకాలు చేపట్టడం అన్యాయమని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విమర్శించారు. రోస్టర్ కమ్ మెరిట్ చూడకుండా కేవలం మెరిట్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టడం సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కడమేనని అన్నారు. గురువారం హైదరాబాద్లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ ఇటీవలే టీఆర్టీ కౌన్సెలింగ్ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు జరిగాయని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రోస్టర్ కమ్ మెరిట్ ప్రాతిపదికన ఉపాధ్యాయ నియామకాలు జరిగేవని అన్నారు. కానీ తెలంగాణలో రోస్టర్ కమ్ మెరిట్ విధానాన్ని పాటించకుండానే ఉపాధ్యాయ నియామ కాలు జరిగాయన్నారు. ఈ కౌన్సెలింగ్లో మెరిట్లో ముందున్న వారికి జిల్లా కేంద్రాలకు దగ్గర ఉన్న ప్రాంతాల్లో, వెనకున్న వారికి దూరప్రాంతాలు, మారుమూల ప్రాంతాలకు పోస్టింగ్లు వచ్చాయని చెప్పారు. రోస్టర్ పాయింట్లలో ముందున్నా పట్టించు కోలేదన్నారు. సామాజిక న్యాయాన్ని అధికారులు తుంగలో తొక్కారని విమర్శించారు. రోస్టర్ కమ్ మెరిట్ పాటించకుండా నియామకాలు చేపట్టడం అన్యాయమని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జీవోల్లో రోస్టర్ కమ్ మెరిట్ ఉండేదని చెప్పారు. కానీ తెలంగాణ ప్రభుత్వం టీఆర్టీ కౌన్సెలింగ్ కోసం జారీ చేసిన జీవోలో రోస్టర్ అండ్ మెరిట్ అని పొందుపరిచారని అన్నారు. పాఠశాల విద్యాశాఖ చేసిన తప్పిదాన్ని సరిచేసుకోవాలని డిమాండ్ చేశారు. టీఆర్టీ రీకౌన్సెలింగ్ నిర్వహించాలని కోరారు. రోస్టర్ కమ్ మెరిట్ ఆధారంగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని అన్నారు. రోస్టర్ కమ్ మెరిట్ ఆధారంగా కొత్త జాబితా తయారు చేసి ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంగల వెంకటి మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవహరించిన తీరువల్ల ఎస్సీ,ఎస్టీ,బీసీ, వికలాం గులు, మహిళలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. టీఆర్టీ రీకౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. తప్పిదాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ రాష్ట్ర, జాతీయ కమిషన్లకు ఫిర్యాదు చేస్తామని, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అంజయ్య, యాదయ్య, సాయన్న, ప్రవీణ్నాయక్, లింగం, భాస్కర్, తారాసింగ్, సుశీల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.