Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రౌండ్ టేబుల్లో నేతల హెచ్చరిక
- మున్సిపల్ ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్లు,
- ఏబీసీడీ వర్గీకరణ అమలుకు డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
''మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఒక్క శాతం తగ్గినా సహించబోం.. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 21 శాతానికి తగ్గించడం వల్ల జెడ్పీ చైర్మెన్లు, మండలాధ్యక్షులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల స్థానాలను కోల్పోయామని ఇదే పరిస్థితి మున్సిపల్ ఎన్నికల్లో పునరావృతమైతే సహించబోం'' అని రౌండ్టేబుల్లో వక్తలు హెచ్చరించారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ''మున్సిపల్ ఎన్నికలు - 33 శాతం రిజర్వేషన్లు'' అనే అంశంపై ఎంబీసీ సంఘం ఆధ్వర్యంలో సబ్ప్లాన్ సాధన కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లె గోపాల్ అధ్యక్షతన రౌండ్టేబుల్ జరిగింది. ఇందులో ఎంబీసీ సంఘాల వేదిక రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ సుదర్శన్రావు, ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎస్ వినరుకుమార్, ప్రదేశ్ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏఎల్ మల్లయ్య, బీసీ యూనైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు సాలూరి రామకృష్ణయ్య, రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి నాగరాజు, వృత్తి సంఘాల రాష్ట్ర కో కన్వీనర్ లెల్లెల బాలకృష్ణ తదితర బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ సుదర్శన్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. కేవలం బీసీ రిజర్వేషన్లను తగ్గించేందుకే మున్సిపల్ చట్టాన్ని సవరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించడం వల్ల బీసీలు ఎంతగానో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ బీసీల్లోని 106 తగరతులల్లో రాజకీయ ప్రాతినిధ్యం లేదని తెలిపారు. పైళ్ల ఆశయ్య మాట్లాడుతూ ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల రిజర్వేషన్లు రాలేదని, కేవలం బీసీల సంఘటిత పోరాటంతోనే సాధించుకున్నామన్నారు. ఉద్యమాలతో వచ్చిన రిజర్వేషన్లను తగ్గించే అధికారం ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీసీ రిజర్వేషన్లలో ఏబీబీసీడీఈ వర్గీకరణ చేయాలని సూచించిన విషయాన్ని గుర్తు చేశారు. రిజర్వేషన్లు తగ్గించకుండా పార్లమెంట్లో చట్టం చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఎస్ వినయకుమార్ మాట్లాడుతూ కొత్త మున్సిపల్ చట్టాన్ని ఎవరూ చదవకుండానే ప్రభుత్వం ఆమోదింపచేసుకునే ఆలోచనలో ఉందన్నారు. అక్రమ కట్టడాల కోసమే కొత్త చట్టం తెస్తున్నామని ప్రభుత్వం చెబుతుందని, అక్రమ కట్టడాలు ఆగుతాయో లేదో కానీ, బీసీ రిజర్వేషన్లు మాత్రం తగ్గడం ఖాయమని విమర్శించారు. ఏఎల్ మల్లయ్య మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకనుగుణంగా రిజర్వేషన్లను పెంచాల్సి ఉందని, కానీ సీఎం కేసీఆర్ మాత్రం బీసీలను అణచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాలూరి రామకృష్ణయ్య మాట్లాడుతూ బీసీల పట్ల ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదనితెలిపారు. బీసీ జాబితాలో కొత్త కులాలను చేర్చాలన్నా, తొలగించాలన్నా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని తెలిపారు. ఎంబీసీ నవనిర్మాణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దుర్గారావు మాట్లాడుతూ పంచాయతీలపై మీ పెత్తనం ఏమిటని ప్రశ్నించారు.