Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎడ్లబండిపై ఓపెన్ కాస్ట్ నిర్వాసిత రైతు కుటుంబం యాత్ర
- కారేపల్లిలో అడ్డుకున్న పోలీసులు
- రికార్డుల్లో వారి పేర్లు లేవన్న అధికారులు
నవతెలంగాణ- ఇల్లందు
సింగరేణి ఉపరితల గనుల్లో భూమి కోల్పోయి దశాబ్దాలు గడుస్తున్నా పరిహారం కానీ, ఉద్యోగం కానీ ఇవ్వడం లేదనీ ఓ రైతు కుటుంబం వినూత్నంగా నిరసన చేపట్టింది. ఎడ్లబండిపై ముఖ్యమంత్రిని కలిసేందుకు గురువారం పయనమైంది. వారి సమస్య ప్రజలకు అర్థమయ్యేలా బండిపైన, వారి మెడల్లోనూ బ్యానర్లుగా కట్టుకుని భిక్షాటన చేస్తూ వెళుతుండగా కారేపల్లి మండలంలో వారిని అరెస్టు చేశారు. ఈ ఘటన వివరాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు 7వ వార్డు బర్లపెంట ఏరియాకు చెందిన సుందర్లాల్ లోథ్ కుటుంబం వ్యవసాయం చేసుకుని జీవనం సాగించేది. సింగరేణిలో భూములు కోల్పోయిన అనంతరం ఎడ్లబండిపై ఇటుక, ఇసుక, మట్టిని కిరాయిలకు తోలుతూ జీవనం సాగిస్తున్నాడు. సుందర్లాల్ తాత జగన్లోథ్కు, వారి బంధువుల ఏడు కుటుంబాలకు కలిపి కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లిలో 50 ఎకరాల భూమి ఉంది. ఓసీ కోసం మూడు దశాబ్దాల కిందట సింగరేణి ఆ భూములను తీసుకుంది. పరిహారాలు ఇస్తామని నమ్మబలికింది. దానికోసం జగన్లోథ్ ఎదురు చూసీచూసీ నిరాశతోనే మరణించాడు. అనంతరం ఆయన కొడుకు భగీరథ లోథ్ న్యాయం చేయాలని కోర్టులో కేసు వేశాడు. కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి అనారోగ్యంతో ఆయన కూడా చనిపవోయాడు. తదనంతరం ఆయన కొడుకు సుందర్లాల్ లోథ్ పరిహారం కోసం కలెక్టర్, ఆర్డీఓ, జీఎం, తహసీల్దార్లకు అనేక సార్లు విన్నవించాడు. అధికారులు పట్టించుకోలేదు. దీంతో గతంలోనూ ఎడ్లబండిపై భిక్షాటన చేశాడు. సింగరేణి సంస్థ వల్ల భిక్షగాడిగా మారిన రైతు అని బ్యానర్ కట్టి, తను వేసుకున్న బట్టలపైన కూడా అలాగే రాసుకుని బండితో కొంతకాలం నుంచి ఇసుక, మట్టి, ఇటుకలు తోలకాలు చేస్తున్నాడు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో తిరిగి గురువారం మరోమారు సుందర్లాల్ లోథ్, ఆయన భార్య లలితాబాయి, కుమార్తె మాలతి, కుమారుడు సంజరుతో కలిసి ఎడ్లబండిపై హైదరాబాద్కు బయలుదేరాడు. నేరుగా సీఎం కేసీఆర్ కార్యాలయానికి వెళ్లి న్యాయం కోరాలని నిర్ణయించుకున్నారు. సీఎం అయినా కనికరించి సమస్య పరిష్కరిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.
కారేపల్లిలో అడ్డుకున్న పోలీసులు
ఎడ్లబండిపై బయలుదేరిన సుందర్లాల్ లోథ్ కుటుంబ సభ్యులను కారేపల్లిలో పోలీసులు అడ్డుకున్నారు. వారిని సింగరేణి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చారు. సింగరేణి కాలరీస్ ఎస్టేట్ అధికారి సునిత తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి పహాణీలను పరిశీలించారు. ఈ సందర్భంగా సునిత మాట్లాడుతూ.. 1991లో సింగరేణి సంస్థ సేకరించిన భూములన్నిం టికీ పరిహారం చెల్లించామన్నారు. సుందర్లాల్ లోథ్కు సంబంధించి రెవెన్యూ పహాణీ రికార్డుల్లో కానీ, సింగరేణి సంస్థ రికార్డుల్లో కానీ ఎలాంటి భూమీ లేదన్నారు. ఈ సర్వే నెంబర్లో పట్టాదారుడిగా పర్సా వెంకటేశ్వర్లు, అనుభవనదారుడిగా పోలం వీరన్న ఉన్నారన్నారు. అయితే, ఆ భూమిలో వీరు ఆక్రమణదారులుగా ఉండటం వల్లే పరిహారం రాలేదని తెలిపారు.