Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మారని కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరు
- తారాస్థాయికి సీఎల్పీ విభేదాలు
- నిరసనకు జగ్గారెడ్డి దూరం
- రాజగోపాల్రెడ్డి భిన్నంగా..
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఐక్యత కొరవడింది. ఆరుగురు ఎమ్మెల్యేలే కానీ వారి మధ్య సఖ్యత లేదనలే వ్యవహరిస్తు న్నారు. అధికార టీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా అటు అసెంబ్లీలోనూ, ఇటు బయట నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేయగా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎడమొహం, పెడమొహంగా వ్యవ హరించారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొడెం వీరయ్య నల్ల కండువా లతో నిరసన తెలిపారు. అక్కడే ఉన్నా మునుగోడు ఎమ్మెల్యే రాజ గోపాల్రెడ్డి మాత్రం వారికి దూరంగా ఉన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసెంబ్లీ ప్రారంభమైన కొద్ది సేపటికే బయటకు పోయి సీఎల్పీ కార్యాలయంలో కూర్చున్నారు. ప్రజాసమస్యలను ప్రస్తావిం చే కీలకమైన శాసససభ సమావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరించడంలో అసెంబ్లీ లాబీల్లో చర్చనీయాంశమైంది. దీంతో ఆరుగురు ఎమ్మెల్యేల్లో విభేదాలు తారాస్థాయికి చేరాయని సీఎల్పీ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే టీఆర్ఎస్లో విలీనమయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. అయినా కాంగ్రెస్ పార్టీ నేతల తీరు మారడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కీలకమైన మున్సిపల్ చట్టం ముసాయిదాపై చర్చ జరిగే సమయంలో ఈ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఎమ్మెల్యేల్లో నెలకొన్న అంతర్గత గ్రూపుల కారణంగా శాసనసభ సమావేశాలకు ముందు కూడా సీఎల్పీ సమావేశం కూడా నిర్వహించలేదని ఆ వర్గాలు అంటున్నాయి. మున్సిపల్ చట్టం ముసాయిదాలో అనుకూల, ప్రతికూల అంశాలపై చర్చించి, కార్యాచరణ రూపొందించాల్సి ఉన్నది. సీఎల్పీనేత అలాంటి ప్రయత్నాలు చేయకుండానే అసెంబ్లీకి రావడంతో జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇప్పటికిప్పుడు అసెంబ్లీకి వచ్చిన ఏం మాట్లాడతామని అన్నట్టు తెలిసింది. ఇప్పటికే సీఎల్పీ నేతకు జగ్గారెడ్డికి మధ్య పొసగడం లేదని పార్టీ వర్గాలే బాహాటంగా అంటున్నాయి. జగ్గారెడ్డి కేసీఆర్, టీఆర్ఎస్కు అనుకూలంగా మాట్లాడుతూ పార్టీలో గందరగోళానికి తెరలేపారు. దీంతో ఆయన పార్టీలో ఉంటారా? టీఆర్ఎస్లో చేరుతారా? అనేది కొంత కాలంగా చర్చ నడుస్తున్నది. మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఏదో ఒకటి మాట్లాడి పార్టీని ఇబ్బంది పెడుతున్నారనే భావన ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. పార్టీపై, అధ్యక్షుడిపై, తాజాగా సీఎల్పీ నేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని, ఆ తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలతో సీఎల్పీ నేతను ఎన్నుకోలేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యేలం మాత్రమే మిగిలామనీ, సీఎల్పీలేదంటూ మీడియాతో అనడం గమనార్హం. ఇప్పటికే ఆయన బీజేపీ గూటికి చేరుతారనే ప్రచారం ఉన్నది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పక్కన ఉన్నా...ఆయన అంటిముట్టనట్టే వ్యవహరించారు. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలదండలు వేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు అనుమతి లభించలేదు. దీనిపై మీడియా పాయింట్లో మాట్లాడేందుకు వెళ్లే క్రమంలో రాజగోపాల్రెడ్డి ముందే వెళ్లి మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కలిసి మీడియాతో మాట్లాడాలనే సీఎల్పీ నేత ప్రయత్నం వృథా అయింది. ఇదిలా ఉండగా రాజగోపాల్రెడ్డి మీడియాతో మాట్లాడి వెళ్లి పోతున్న సమయంలో రాజగోపాల్రెడ్డి రా... అని శ్రీధర్బాబు పిలిచిన ఆయన రాలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేవే కదా? అని చెప్పినప్పటికి ఆయన సున్నితంగా తిరస్కరించారు.