Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిజర్వేషన్లకు తుది రూపమిస్తున్న అధికారులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అసెంబ్లీలో నూతన చట్టం ఆమోదం పొందిన నేపథ్యంలో మున్సిపల్ శాఖ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఎన్నికల కోసం తుది కసరత్తు చేపట్టారు. పురపాలక శాఖ అధికారులు రిజర్వేషన్లకు తుదిరూపం ఇచ్చే పనిలో నిమగమై ఉండగా, ఎన్నికల కమిషన్ సిబ్బందికి శిక్షణను పూర్తి చేసే పనిలో పడింది. ఓటర్ల తుది జాబితాలో అవకతవకలను సరి చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని మున్సిపాల్టీలకు సంబంధించిన వార్డుల పునర్విభజన, ఓటర్ల తుది జాబితాలు న్యాయవివాదాల్లో చిక్కుకున్న నేపథ్యంలో మిగిలిన వాటిలో అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించనున్న మున్సిపాల్టీలు, కార్పొరేషన్లతో పాటు ప్రస్తుతం ఎన్నికలు లేని జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్ లకు కూడా రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. 128 మున్సిపాల్టీలు, 13 కార్పొరేషన్లకు గాను పలు మున్సిపాల్టీలు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టే వచ్చిన మున్సిపాల్టీల ఓటర్లను పరిగణలోకి తీసుకుని మొత్తం ఓటర్లను గణించి రిజర్వేషన్లను ఖరారు చేయాలా? లేక ఆ మున్సిపాల్టీలను వదిలేసి గణించాలా? అనే విషయంపై అధికారులు ప్రభుత్వం నుంచి స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు. మరో వైపు నూతన చట్టం గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వుల మేరకు రిజర్వేషన్ల కోసం రూల్స్ రూపొందించాల్సి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లను సోమవారం ఖరారు చేయాలని అధికారులు నిర్ణయించారు.ఈ నేపథ్యంలో కసరత్తు పూర్తి కాకపోవడంతో ఆదివారం కూడా విధులు నిర్వహించాలని ఇప్పటికే సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఓటర్లకు సంబంధించిన తుది జాబితాలో తప్పులు దొర్లాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆదివారం పని చేయనుంది. మేయర్లు, డిప్యూటీ మేయర్ల రిజర్వేషన్లను పురపాలక శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించనుండగా, వార్డుల రిజర్వేషన్లను స్థానిక మున్సిపాల్టీల్లో ఎంపిక చేయనున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ల రిజర్వేషన్ల కోసం అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలోని మొత్తం జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటారు. వార్డుల రిజర్వేషన్లకు మున్సిపాల్టీలో ఉన్న జనాభాను పరిగణలోకి తీసుకోనున్నారు. మొత్తం రిజర్వేషన్లను 50 శాతం దాటకుండా కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం కేటాయించి 50 శాతంలో మిగిలిన బీసీలకు రిజర్వ్ చేయనున్నట్టు ఒక ఉన్నతాధికారి తెలిపారు. జనరల్ తో పాటు రిజర్వేషన్ అయిన అన్ని కేటగిరీల్లో మహిళలకు 50 శాతం చొప్పున రిజర్వేషన్లను లాటరీ పద్దతిలో ఎంపిక చేస్తారు.