Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1000 చెట్లకు ఎసరు
- వందలాది పక్ష్యాదుల వలస బాట
- కనుమరుగు కానున్న ఔషధ, పండ్ల మొక్కలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సచివాలయానికి కూల్చివేత ముప్పు ముంచుకొస్తున్నది. లక్షలాది ఫైళ్లు తరలిపోతున్నాయి. కార్యాలయాలన్నీ ఖాళీ అవుతున్నాయి. ఈ తతంగం ముగియగానే భవనాల కూల్చివేత ప్రారంభించనుంది. ఈ భవనాలు 25 ఎకరాల్లో విస్తరించి ఉన్న సంగతి తెలిసిందే. భవనాలతోపాటు భారీ వృక్షాలు, పండ్లు, పూల మొక్కలు, పక్షులు ఇలా ఎన్నెన్నో కనుమరుగు కానున్నాయి. నిజాం కాలం నుంచి నేటి హరితహారం వరకు పెట్టిన చెట్లు సచివాలయంలో మొక్కలు విస్తరించి ఉన్నాయి. వేప, మామిడి, రావి, బాదం, కానుగ, మేడి, సుబాబుల్, మర్రి, నీలగిరి, బొంగురు మల్లే భారీ వృక్షాలకు నేటి ఈ సచివాలయం నెలవుగా ఉంది. జామ, నేరెడు, సీతాఫలం వంటి పండ్ల చెట్లు సైతం లోపల ఉన్న విషయం విధితమే. అంతేకాకుండా జిల్లేడు, తిప్పతీగలాంటి ఔషధ మొక్కలు, పూల మొక్కలు కూడా ఉన్నట్టు అధికారులు చెప్పారు. ఇవన్నీ దశాబ్దాలుగా పెరిగి మహావృక్షాలుగా ఎదిగాయి. ఇలాంటి చెట్లు ఎంతో చల్లదనాన్ని, మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇస్తున్నాయి. తాజాగా సచివాలయం కూల్చివేత నిర్ణయంతో ఇలాంటి మహావృక్షాలు, ఔషధ మొక్కలకు ప్రమాదం ఏర్పడనుంది. సచివాలయంలో ఉన్న సుమారు వెయ్యి చెట్లు ఇక కనిపించే అవకాశం లేదు. ఇప్పటికే హరితహారం పేరుతో మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం, నాటిన మొక్కల్లో 85 శాతం బతకాలనీ, లేకపోతే అందుకు సంబంధించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సచివాలయంలోని చెట్ల పరిస్థితి సవాల్గా మారింది. వాతావరణంలో తేమ శాతం తగ్గిపోయి, ఉష్ణోగ్రత తీవ్రత పెరిగి, భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారనుందని ఆయన శుక్రవారం అసెంబ్లీ సాక్షిగా ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కలకు, చెట్లకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి సచివాలయంలో వెయ్యి చెట్ల దుస్థితిపై దృష్టి సారించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హుస్సేన్సాగర్ నుంచి వస్తున్న దుర్వాసన, దుర్గంధం వంటి కలుషిత వాతావరణాన్ని సాగర్ చుట్టూ ఉన్న సంజీవయ్య పార్కు, ఇందిరాపార్కు, లుంబీనిపార్కు, సచివాలయం, మింట్ కాంపౌండ్, ఎన్టీఆర్ మార్గ్ (ఖైరతాబాద్ ప్లైఓవర్) తదితర ప్రాంతాల్లో చెట్లు విరివిరిగా ఉండటం, చుట్టు పచ్చదనం పరిచినట్టు ఉండటంతో ఆ దుర్గంధం సమస్యను చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ కొంతవరకు విముక్తి కలిగిస్తున్నదని వృక్ష ప్రేమికులు అంటున్నారు. ఈనేపధ్యంలో ఒకేసారి వెయ్యి చెట్లు నరికివేయడం వల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతింటున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
మూగబోనున్న కోకిల రాగాలు...పక్షుల కిలకిలలు
పచ్చని వృక్షాలపై ఆధారపడి జీవించే పక్షుల కిలకిలలు...కోకిల రాగాలు సచివాలయంలో ఇక మూగబోనున్నాయి. చెట్ల నరికివేతతో పక్షులు వలసబాట పట్టనున్నాయి. భారీ వృక్షాలపై అనేక పక్షాలు, కాకులు, గద్దలు, పిట్టలు, కోకిలలు, కొంగలు, పావురాలు ఇలా అనేక పక్షి జాతులు ఉన్నాయి. ఎన్నడూ చూడని కొన్ని అరుదైన పక్షులు సైతం అప్పుడప్పుడు చెట్లపై దర్శనమిస్తాయని సచివాలయంలోని ఉద్యోగి ఒకరు చెప్పారు. సచివాలయం నుంచి ఫర్నీచర్, ఫైళ్లు ఎన్నో తరలిస్తున్న సర్కారు పక్షుల పరిస్థితిపై ఆలోచించడం లేదని గత 30 ఏండ్లుగా పని చేస్తున్న మహిళా అటెండర్ ఆవేదన వ్యక్తం చేశారు. వీటితోపాటు వందలాది ఉడుతలు, ఎలుకలు, భూఆధారిత కీటకాలు, పాములు, కప్పలు, చీమలు, ఎర్రలు ఇలా ఎన్నో జీవులు మనుగడ ప్రశ్నార్థం కాబోతున్నది.