Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జర్నలిస్టులకు ఆదర్శప్రాయులు
- ఆయన సంపాదకీయాలు జ్ఞాన సంపాదనకు మార్గాలు
- గోరాశాస్త్రి శతజయంతి సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
నవతెలంగాణ- సిటీబ్యూరో
'సంపదను ప్రతి ఒక్కరూ రూపాయల్లోనే లెక్కిస్తారని, నిండైన పదజాలంతో సంపదను అక్షరాల్లో లెక్కించిన సాహితీ మూర్తి శ్రీ గోవిందు రామశాస్త్రి (గోరాశాస్త్రి)' అని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రశంసించారు. సంపదను అక్షరాలతో లెక్కించే వారిని ప్రపంచం గుర్తిస్తుందని, అదే మార్గంలో గోరాశాస్త్రిని నేటికీ స్మరించుకుంటున్నామని తెలిపారు. సాహిత్య అకాడమీ మరియు వయోధిక పాఠశాల సంయుక్తంగా హైదరాబాద్లోని డా.మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శనివారం నిర్వహించిన గోరాశాస్త్రి శతజయంతి సదస్సులో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. గోరాశాస్త్రి అంటే సంపాదకీయాలు, సంపాదకీయాలు అంటే గోరాశాస్త్రి అన్నంతగా ఆయన పేరు సంపాదించుకున్నారని, అలాంటి వారిని గౌరవించుకోవడం భారతీయ సంస్కతిలో ఒక భాగమని చెప్పారు. ఆయన జీవితాన్ని ఈ తరం పాత్రికేయులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి, జర్నలిజం, సాహిత్యం మీద వారు ఆసక్తి కనబరిచారని చెప్పారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో ఏక కాలంలో సంపాదకీయాలు రాయగల సాహితీ సవ్యసాచిగా పేరు సంపాదించుకున్నారని తెలిపారు. గోరాశాస్త్రి ఏ భాషలో రాసినా చణుకులు, చతురత, విమర్శల విషయంలో పరిధి దాటి వెళ్లలేదన్నారు. ఆయన సంపాదకీయాలను పాఠకులు జ్ఞాన సంపాదనకు మార్గాలుగా భావించేవారని గుర్తు చేశారు. ఈ తరం జర్నలిస్టులకు ఇలాంటి మహనీయుడి జీవితాన్ని, సంపాదకీయాలను పాఠాలుగా బోధించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ సందర్భంగా గోరాశాస్త్రి సంపాదకీయాల సంకలనం, వినాయకుడి వీణ పుస్తకం మరియు మోనోగ్రాఫ్ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు, వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్ష కార్యదర్శులు జిఎస్.వరదాచారి, కె.లక్ష్మణరావు, పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.