Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జగన్నాథపురంలో సింగరేణి భూనిర్వాసితుల ధర్నా
నవతెలంగాణ-సత్తుపల్లి
సింగరేణిలో భూములు కోల్పోయిన తమకు న్యాయమైన ప్యాకేజీ ఇవ్వాల్సిందేనని, అలా కాదని పనులు ప్రారంభిస్తే దేనికైనా వెనుకాడ బోమని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల కిష్టారం భూనిర్వాసితులు తేల్చి చెప్పారు. జగన్నాథపురంలో పనులు జరుగుతుండగా శనివారం కిష్టారం భూనిర్వాసితులు అక్కడ ఆందోళనకు దిగారు. సింగరేణి అధికారులు భూనిర్వాసితులను భయభ్రాంతులకు గురిచేయడమేగాక రౌడీయిజానికి దిగుతున్నారని అన్నారు. న్యాయమైన పరిహారం అందే వరకు అంగుళం పని కూడా జరగనీయమని తెగేసి చెప్పారు. భూములు, ఇండ్లు, ఇండ్ల స్థలాలను కోల్పోతున్న గిరిజన కుటుంబాలకు అన్యాయం చేసేందుకు సింగరేణి యాజమాన్యం ప్రయత్నిస్తోందన్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద కుటుంబానికి రూ.15లక్షలు, 5కుంటల ఇండ్ల స్థలం, ఎకరాకు రూ.20లక్షల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉడతనేని అప్పారావు, రావి నాగేశ్వరరావు, ఎంపీటీసీ ఇరపా కృష్ణారావు, మామిళ్లపల్లి కృష్ణయ్య, నగేశ్, ఆశీర్వాదం, శ్రీనివాసరావు, మోహనరెడ్డి పాల్గొన్నారు.