Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి: టీఎస్ ఎస్డబ్ల్యూఎఫ్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్.రావు
నవతెలంగాణ-కంఠేశ్వర్
నిజామాబాద్ రీజియన్ పరిధిలో డిపో మేనేజర్లు కార్మికులను వేధింపులకు గురిచేయడం సరికాదని తెలంగాణ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్డబ్ల్యూఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్.రావు అన్నారు. డ్యూటీలను మార్చడం పేరుతో విపరీతంగా కిలోమీటర్లు, పని గంటలు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం డిపో-1 నుంచి ఆర్ఎం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారుల ప్రవర్తన వల్ల మొత్తం రీజియన్లోని కార్మికులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని చెప్పారు. ఇదే విషయమై పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చినా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. రీజియన్లో అన్ని సర్వీసులకూ రూట్ సర్వే చేయించి రన్నింగ్ టైం ఫిక్స్ చేయాలని డిమాండ్ చేశారు. పని భారాన్ని తగ్గించాలని, మార్చిన సింగిల్ డ్యూటీలను గతంలో ఉన్న స్పెషల్ ఆఫ్ డ్యూటీలుగా మార్చాలని అన్నారు. అన్ని డిపోల్లో సీనియారిటీ ప్రకారం డ్యూటీ చార్టులు వేయాలని కోరారు. బ్రీత్ అనలైజర్ తప్పు వల్ల బాన్సువాడ డిపోలో జరిగిన ఆందోళన సందర్భంగా చేసుకున్న ఒప్పందానికి భిన్నంగా నష్టాన్ని రికవరీ చేసే పేరిట ఇచ్చిన చార్జిషీటును రద్దు చేయాలన్నారు. మెడికల్ అన్ఫిట్ అయి, శ్రామికులుగా వచ్చిన వారిపై వేధింపులు మానుకోవాలని, మెకానిక్ పనులు చేయించొద్దని అన్నారు. రీజియన్లో అన్ని ఖాళీలను భర్తీ చేయాలని, అర్హత ఉన్న వారికి ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బస్సుల కండిషన్ మెరుగుపరిచి, మెకానిక్లకు అవసరమైన టూల్స్, స్పేర్స్ తదితర వస్తువులు సరఫరా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు రామచందర్, జిల్లా గౌరవ అధ్యక్షులు నూర్జహాన్, యూనియన్ అధ్యక్షులు శంకర్, కార్యదర్శి సంజు, వర్కింగ్ ప్రెసిడెంట్లతోపాటు కార్మికులు పాల్గొన్నారు.