Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమగ్ర అధ్యయనం, చర్చ లేకపోవడం సరికాదు
- సమస్యలు పరిష్కరించాకే ఎన్నికలు జరపాలి :
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మున్సిపల్ చట్టంపై సమగ్ర అధ్యయనం, చర్చ లేకపోవడం సరైంది కాదని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఏకపక్షంగా మున్సిపల్ బిల్లును ఉభయసభలు ఆమోదించడం తగదని హెచ్చరించింది. కొత్త మున్సిపాల్టీల ఏర్పాటు, వార్డుల విభజన, ఓటరు జాబితా ప్రకటన వంటి అంశాల్లో అనేక పొరపాట్లు జరిగాయని తెలిపింది. ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించిన తర్వాతే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మున్సిపల్ ఎన్నికలకు 150 రోజులు గడువు కావాలని హైకోర్టును కోరినా ప్రభుత్వం హడావుడిగా 50 రోజుల్లో నిర్వహిస్తామనడం సరైంది కాదని తెలిపారు. ఎన్నికల దృష్ట్యా కొత్త మున్సిపల్ బిల్లును ఈనెల 18న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రవేశవపెట్టి సమగ్ర చర్చ లేకుండా ఆమోదింపచేసుకున్నారని పేర్కొన్నారు. ఇది స్థానిక సంస్థలు స్వయంపాలితంగా వుండాలనే 74వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.
పురపాలక ఎన్నికలకు 150 రోజుల గడువు కావాలని హైకోర్టును ప్రభుత్వం కోరిందని తెలిపారు. హైకోర్టు అంగీకరించిందని పేర్కొన్నారు. కానీ హడావుడిగా 50 రోజుల్లోనే నిర్వహించడానికి ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు. ఇందులో భాగంగానే తక్కువ గడువులో వార్డుల విభజన, ఓటరు జాబితా, బూత్ల ప్రకటించారని పేర్కొన్నారు. వాటిలో అనేక పొరపాట్లు బహిర్గతం కావడంతో అనేక మంది పౌరులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని తెలిపారు.
మున్సిపాల్టీలపై కలెక్టర్లు శ్రద్ధ పెట్టగలరా?
ఈ చట్టంలో జిల్లా కలెక్టర్లకు విస్తృత అధికారాలు పొందుపరిచారని వీరభద్రం పేర్కొన్నారు. ఇప్పటికే కలెక్టర్లకు వందకుపైగా శాఖల పర్యవేక్షణ ఉందని తెలిపారు. ఇదీ వారికే అప్పగించడం వల్ల మున్సిపాల్టీలపై తగిన శ్రద్ధ పెట్టలేని పరిస్థితి వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. కలెక్టర్ కూడా బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలనడం అంటే స్థానిక సంస్థలను, మున్సిపాల్టీలను బ్యూరోక్రసీకి అప్పగించడమేనని విమర్శించారు. దీంతోపాటు చైర్మెన్, వైస్ చైర్మెన్, కౌన్సిలర్లను హరితహారంలో 85 శాతం చెట్లు పెంచకపోతే చర్యలు తీసుకుంటామని చట్టంలో పొందుపరిచారని తెలిపారు. చెట్లు అనేక కారణాలతో చనిపోతాయని, ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధిని బాధ్యున్ని చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. చెత్త సేకరణలో యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని తెలిపారు. తడి, పొడి చెత్త విషయంలో ప్రజలు, కాలనీవాసులను బాధ్యులను చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో మున్సిపల్ అధికారులు తమ బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశముందని తెలిపారు.
బీసీ రిజర్వేషన్లు 34 శాతం ఊసేలేదు
ఈ చట్టంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలు ఊసేలేదని తమ్మినేని వీరభద్రం విమర్శించారు. 30 ఏండ్ల నుంచి 34 శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలవుతున్నాయని తెలిపారు. 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఏబీసీడీఈ వర్గీకరణ చేయడానికి చట్టంలో పొందుపరచాలని కోరారు. మున్సిపాల్టీలు, కొత్తగా ఏర్పడే మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో గ్రామాలు కలుస్తున్నాయని తెలి పారు. ఈ గ్రామాల్లో వ్యవసాయం, గ్రామీణ కూలీలు, సబ్సిడీ పథకాలు పోతాయని పేర్కొన్నారు. వారికి పట్టణ పన్నులు, వృత్తి పన్నులు వర్తించి జీవన వ్యయం పెరుగుతుందని తెలిపారు. వారికి ఆ స్థాయిలో ఉపాధి వేతనాలు లేకపోతే జీవన పరిస్థితులు దుర్భరమవుతాయని పేర్కొన్నారు. మురికివాడల అభివృద్ధికి అవసరమైన పథకాలు, పేదరిక నిర్మూలన పథకాల ప్రస్తావన లేదని తెలిపారు. రాష్ట్రంలో 40 శాతానికిపైగా జనాభా పట్టణాల్లో ఉందని పేర్కొన్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై సమ గ్ర అధ్యయనం లేకుండా, రాజకీయ పార్టీలు, ఇతర సంఘాలు, సంస్థలను భాగస్వాములను చేయకుండా ఏకపక్షంగా మున్సిపల్ బిల్లును ప్రవేశపెట్టారని విమర్శించారు. అద్భుతమైన సంస్కరణలతో బిల్లును తెచ్చామని చెప్తున్నా అనేక లోపాలున్నాయని తెలిపారు. వాటిని సరిచేయకుండా చట్టం అమలు చేస్తే అనేక సమస్యలొస్తాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి చట్టంలో ఉన్న లోపాలను తొలగించాలని, అవసరమైన వాటిని పొందుపరచాలని డిమాండ్ చేశారు.