Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాజెక్టుకు భూములిచ్చి పదేండ్లు అయినా పూర్తి పరిహారం అందలే..
- జాతీయ రహదారిపై 'ఎల్లంపల్లి' నిర్వాసితుల ధర్నా
- 15మందిపై కేసు
నవతెలంగాణ - హాజీపూర్
'ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసినం.. పదేండ్లు అయినా ఇప్పటి వరకూ పూర్తి స్థాయి పరిహారం అందలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇంటి నిర్మాణం కోసం రూ.70వేలు ఇస్తామని చెప్పిన టీఆర్ఎస్ నాయకులు విస్మరించారు' అంటూ ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులు శనివారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట్ వద్ద 63వ నెంబరు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని రెండు గంటలపాటు భీష్మించుకూర్చున్నారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల ముందు స్థానిక ఎమ్మెల్యే దివాకర్రావు ఎల్లంపల్లి పునరావాస కాలనీల్లో ప్లాట్ వచ్చిన వారందరికీ ఇల్లు నిర్మించుకున్నా, నిర్మించుకోకున్నా రూ.70వేలు ఇప్పిస్తానని ఓట్లు వేయించుకున్నాడని విమర్శించారు. సర్పంచ్ ఎన్నికల సమయంలోనూ.. వారం రోజుల్లో డబ్బులు ఖాతాల్లో పడతాయని చెప్పి మళ్లీ ఓట్లు వేయించుకున్నారని అన్నారు. ఎంపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇదే ప్రచారం చేసిన ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా ఇంటి నిర్మాణ ప్యాకేజీ ఊసెత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పునరావాస కాలనీల్లో కనీస సౌకర్యాలు కల్పించలేదని, కమ్యూనిటీ హాల్, డ్వాక్రా భవనాలు నిర్మిస్తామని చెప్పి ఆరేండ్లు గడించిందన్నారు. హామీల అమలు, సౌకర్యాల జాడే లేకపోగా.. ప్రాజెక్ట్ కోసం సర్వం త్యాగం చేసిన తమకు తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ లిఫ్ట్.. ఈ లిఫ్ట్ ఏర్పాటు చేసి పంటలకు నీరిస్తామని చెప్పారు.. కానీ గుంట భూమి కూడా తడుస్తలేదని అన్నారు. 'మా జీవితాలను తాకట్టు పెట్టి.. ఎక్కడో ఉన్న హైదరాబాద్, సిద్దిపేట వంటి నగరాలకు తాగేందుకు నీరు దోచుకుపోతున్నారు. తలాపున గోదావరి ఉన్నా మాకు మాత్రం గుక్కెడు నీరు ఇవ్వడం లేదు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పునరావాస కాలనీల్లో కనీసం శ్మశాన వాటికలు కూడా లేకపోవడంతో ఐదు కిలోమీటర్లు వెళ్లి అంతిమసంస్కారాలు జరుపుతున్నామన్నారు. ఈ విషయమై గతంలో శవాలను పట్టుకొని ఇదే జాతీయ రహదారిపై గంటల తరబడి నిరసన తెలిపినా నాయకుల్లో ఎలాంటి స్పందనా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజీపూర్ ఎస్ఐ చందర్, రూరల్ సీఐ కృష్ణకుమార్ ఘటనా స్థలానికి చేరుకుని తహసీల్దార్ పుష్పలతకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న ఆమె అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పగా, కలెక్టర్ రావాలని నిర్వాసితులు పట్టుబట్టారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వర్ వచ్చి తానే స్వయంగా సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
15మంది నిర్వాసితులపై కేసు
ధర్నా చేపట్టి రెండు గంటలకుపైగా జాతీయ రహదారిని దిగ్బంధించారని 15మందిపై ఎస్ఐ కేసు నమోదు చేశారు. ఈ విషయమై నిర్వాసితులు ఒడ్డె బాలరాజు(గుడిపేట ఎంపీటీసీ), ముత్తె నగేష్, ఒడ్డె రాజమౌళి మాట్లాడుతూ.. న్యాయం కోసం పోరాడితే ప్రభుత్వం కేసులు బనాయిస్తోందన్నారు. ఏండ్లు గడుస్తున్నా పునరావాస ప్యాకేజీ రాకపోవడం, అనేకసార్లు ఎమ్మెల్యే దివాకర్రావు, కలెక్టర్కు విన్నవించినా న్యాయం జరగకపోవడంతోనే ధర్నా చేశామని తెలిపారు. న్యాయం చేయాల్సింది పోయి కేసులు పెట్టడం బాధాకరమన్నారు.