Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హద్దులు దాటి ఇసుక తోడేశారు
- మేడిగడ్డ అన్నారం బ్యారేజీల వద్ద నిబంధనలు బేఖాతర్
- పూడిక పేరుతో వ్యాపారం
- 3.35 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అమ్మిన ఖనిజాభివృద్ధి సంస్థ
- రోజుకు 4 వేల ట్రక్కుల ద్వారా రవాణా
- అంతరించిన వృక్ష సంపద:కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ
- మండలి నిపుణుల కమిటీ పరిశీలన
- ఎన్జీటీకి నివేదిక సమర్పించిన అధికారులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
గోదావరి నదిలో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వద్ద జరిగిన ఇసుక తవ్వకాల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకు న్నాయని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణమండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఇటీవల సంయుక్తంగా జరిపిన పరీశీలనలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. సీపీసీబీ సీనియర్ శాస్త్రవేత్త నజీముద్దీన్ ఈ కమిటీకి నేతృత్వం వహించారు. 26 ఇసుక రీచ్లను పరిశీలించిన కమిటీ ప్రతి రీచ్ వద్ద నిబంధనల ఉల్లంఘన ఏవిధంగా జరిగిందో దర్యాప్తు జరిపింది. గూగుల్ మ్యాప్లతో పాటూ టేప్ల ద్వారా గుంటలను కొలతులు తీని ఇసుక తవ్వకాల తీవ్రతను అంచనా వేసింది. పూడిక పేరుతో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల సమీపంలోని 39 కిలోమీటర్ల పరిధిలో 28 ఇసుక రీచ్లను గుర్తించి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు కేటాయించారు. మేడిగడ్డ బ్యారేజీ ఎగువ ఖనిజాభివృద్ధి సంస్థకు కేటాయించారు. మేడిగడ్డ బ్యారేజీ ఎగువ భాగంలో 10 గ్రామాల సమీపంలో 4,03,45,000 క్యూబిక్మీటర్లు, అన్నారం బ్యారేజీ ఎగువ భాగంలో 1,26,00,000 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సిఫారసు చేసింది. ఇటీవల కేంద్ర బృందం పర్యటించే నాటికి 3,35,43,639 క్యూబిక్ మీటర్ల ఇసుకను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అమ్మకాలు జరిపిందని నివేదికలో పేర్కొన్నారు. నివేదికలోని కీలక అంశాలు ఈ విధంగా ఉన్నాయి.
- గోదావరి నదిలో మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఇసుక బ్లాక్ల మందం 2 నుంచి 3 మీటర్లు కాగా అన్నారం బ్యారేజీ వద్ద 1.5 నుంచి 3 మీటర్లుగా గుర్తించారు. వివిధ ఇసుక రీచ్లలో భూమి తగిలే వరకు 3 మీటర్ల ఇసుకను తోడేశారు. మరికొన్ని రీచ్లలో యంత్ర పరికరాలతో 4 మీటర్ల లోతుకు గోతులు తీశారు.
- క్రమ పద్ధతిలో ఇసుక తీయకుండా లోతుకు పోవటంతో నీరు పైకి వచ్చి మడుగులుగా కనిపించింది.
- ఇసుక రీచ్ల సరిహద్దులను (జియో కో ఆర్డినేట్స్) ను మిషన్తో గుర్తించినప్పటికీ నదిలో సరిహద్దులు ఏర్పాటు చేయలేదు. జెండాలు కానీ దిమ్మెలు కానీ ఏర్పాటు చేయలేదు.
- ఇసుక రీచ్ల మందాన్ని గుర్తించే సమయంలోనే ఎటువంటి శాస్ట్రీయమైన పద్దతిని అనుసరించలేదు.
- మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల కోసం సేకరించిన పట్టా భూముల్లో కూడా యధేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేపట్టారు. ఫలితంగా వృక్ష సంపద వృద్ధి తగ్గిపోయింది.
- కొన్ని ఇసుక రీచ్ల వద్ద లారీల బరువును చూసే యంత్రాలు (వెయింగ్ మిషన్స్) ఏర్పాటు చేయలేదు.
- ఒక క్యూబిక్ మీటర్ ఇసుక తీయటానికి ఖనిజాభివృద్ధికి రూ. 83 ఖర్చు కాగా ఆన్లైన్ ద్వారా క్యూబిక్ మీటర్ ఇసుకను రూ. 600 లకు టీఎస్ఎండీసీ అమ్మింది.
- ఇసుక తవ్వకాలు, రవాణా జరిగిన సమీప గ్రామాల్లో పక్కా రోడ్లను కూడా నిర్మించలేదు.
- సమీపంలో ఉన్న కట్టడాలను కాపాడటానికి 'రెడ్ లైన్' ఏర్పాటు చేయలేదు.
- 2016 లో కేంద్ర ప్రభుత్వం ఇసుక తవ్వకాల కోసం జారీ చేసిన మార్గదర్శక సూత్రాలను పాటించలేదు.