Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ మంత్రిపై ఉపాధ్యాయ సంఘాల మండిపాటు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కార్యాలయం అడ్డాగా సాగిన అక్రమ బదిలీలను విద్యాశాఖ మంత్రి జి జగదీశ్రెడ్డి సమర్థించడం సిగ్గుచేటని ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. ఏ ప్రాతిపదికన దొడ్డిదారి బదిలీలు జరుగుతున్నాయని ప్రశ్నించాయి. ఈ మేరకు ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి భుజంగరావు, జి సదానందంగౌడ్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కౌన్సెలింగ్ విధానాన్నే నమ్ముకొని ఉన్న సాధారణ ఉపాధ్యాయుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా సీఎంవో కేంద్రంగా బదిలీలు జరుగుతున్నాయని తెలిపారు. కానీ గతేడాది ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా హామీ ఇచ్చిన భార్యాభర్తల అంతర్జిల్లా బదిలీల షెడ్యూల్ విడుదల కాలేదంటే విద్యామంత్రి చెప్తున్న విశేషాధికారాలు ప్రభుత్వానికి లేవని భావించడమే కారణమా?అని ప్రశ్నించారు. సామాన్యులైన ఉపాధ్యాయుల అంతర్జిల్లా బదిలీల బాధలు ప్రభుత్వానికి పట్టడం లేదని తెలిపారు.
విద్యాశాఖ మంత్రి వ్యాఖ్యలు అసంబద్ధం : టీఎస్పీటీఏ
సీఎంవో నుంచి నిబంధనలు తుంగలో తొక్కి అర్ధబలం, అంగబలం ఉన్న ఉపాధ్యాయుల అక్రమ బదిలీలపై విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి సమర్థించడం అసంబద్ధమని టీఎస్పీటీఏ అధ్యక్షులు సయ్యద్ షౌకత్అలీ, ప్రధాన కార్యదర్శి చెన్న రాములు తెలిపారు. చేసిన తప్పునకు పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా సమర్థిస్తూ వ్యాఖ్యలు చేయడం అవినీతి, అక్రమాలు వారి విధానమని చెప్పకనే చెప్పారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే బదిలీలు జరుగుతాయని మ్యానిఫెస్టోలో ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ఓట్లు అడగాలని కోరారు. అసెంబ్లీ కాలపరిమితి ముగిసిన తర్వాత ఎన్నికలకు వెళ్లకుండా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఎమ్మెల్యేలను ఎన్నిక చేస్తారా? అని ప్రశ్నించారు.