Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎంపీ వివేక్ వెల్లడి, కోదండరామ్ మద్దతు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సచివాలయం, హెరిటేజ్ భవనం ఎర్రమంజిల్ కూల్చివేత నిర్ణయాలను ఆపాలని ఈనెల 25న ప్రజాస్వామిక తెలంగాణ ఆధ్వర్యంలో చలో సచివాలయం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తెలిపారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం సెక్రటేరియట్ కూల్చివేత కొత్త అసెంబ్లీ నిర్మాణంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీలు, విద్యార్థీ, యువజన, మహిళా సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయని అన్నారు. దేశంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు రాజధానిలో సచివాలయం, అసెంబ్లీలు లేనప్పుడు మాత్రమే నిర్మాణాలు చేశారే తప్ప ఉన్నవాటిని కూల్చి కట్టిన దాఖలాలు ఎక్కడా లేవన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 42 మంత్రిత్వ శాఖలు ఈ సచివాలయంలో పాలన కొనసాగించాయని, తెలంగాణ విడిపోయిన తరువాత పట్టుమని 15శాఖలకు ఎందుకు సరిపోవడం లేదని ఆయన ప్రశ్నించారు. సచివాలయానికి మరో 50 సంవత్సరాలు డోకా లేదని నిపుణులైన ఇంజినీర్లు తేల్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత నమ్మకాలు, వాస్తు పేరుతో వేలకోట్ల ప్రజాదనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ కేసీఆర్ ఆరేండ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాల్జేశారని విమర్శించారు. ఆరోగ్యశ్రీ, మిషన్ భగీరథ, రైతు రుణమాఫీ, తదితర సంక్షేమ పథకాలకు వేలకోట్ల బకాయిలు చెల్లించని దయనీయ స్థితిలో, నిర్మాణాల పేరిట రెండువేల కోట్ల ప్రజాధనాన్ని దుబారా చేయడం తగదని హితవు పలికారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలనీ, అవేమి చేయకుండా ఎలా కూల్చి వేస్తారని ప్రశ్నించారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చలో అసెంబ్లీ కార్యక్రమానికి కాగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తెలుగుదేశంపార్టీ రాష్ట్ర కార్యదర్శి నర్సిరెడ్డి, రాష్ట్ర ఫార్వడ్బ్లాక్ అధ్యక్షులు ఆర్వీ. ప్రసాద్ తెలంగాణ జనసమితి కార్యదర్శి ఫక్రుద్ధీన్ ప్రొఫెసర్ విశ్వేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.