Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మున్సిపల్ చట్టంలో మొత్తం రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో బిల్లును ఆమోదించిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తెలిపింది. దీనివల్ల ఎస్సీ,ఎస్టీల రిజర్వేషన్లు కేటాయించిన తర్వాత బీసీ రిజర్వేషన్లకు కోత పడుతుందని పేర్కొంది. బీసీ రిజర్వేషన్లను తగ్గించే ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బుధవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గత మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు అమలయ్యాయని తెలిపారు. కానీ రిజర్వేషన్ తగ్గింపుపై హైకోర్టు, సుప్రీం కోర్టుల తీర్పులను ప్రభుత్వం ప్రస్తావిస్తోందని పేర్కొన్నారు. దీంతోపాటు బీసీ రిజర్వేషన్లను ఏబీసీడీఈ వర్గీకరణ చేయాలనే హైకోర్టు ఆదేశాల విషయంపై ప్రభుత్వం స్పందించడం లేదని తెలిపారు. ఈ రౌండ్టేబుల్ సమావేశంలో వామపక్షాలు, ప్రజాసంఘాలు, సామాజిక సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు.