Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ నేత వంగూరు రాములు
- డీఎంఇ కార్యాలయం ముందు కార్మికుల ధర్నా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కార్మికులకు చట్టబద్ధ హక్కులు కల్పించడంలో ఆదిలాబాద్లోని రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ (రిమ్స్) అధికారులు విఫలమయ్యారని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు విమర్శించారు. ఆదిలాబాద్ రిమ్స్ కార్మికులకు జీ.వో.నెం.14 ప్రకారం జీతాలు చెల్లించాలని, విధి నిర్వహణలో మార్పులు చేయాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని, పీఎఫ్, పేస్లిప్లు ఇవ్వాలని తదితర సమస్యలు పరిష్కరించాలని రిమ్స్ కార్మికులు సోమవారం వైద్యవిద్య సంచాలకుల కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డిమాండ్లతో కూడిన నినాదాలు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్నా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బ్యానర్లు, ప్లెక్సీలు పెట్టారు. కార్యాలయం ముందు బైఠాయించారు. ధర్నాను దాదాపు గంట సేపు పోలీసులు అడ్డుకున్నారు. కొద్ది సేపు పోలీసులు, రిమ్స్ కార్మికులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ధర్నాను ఉద్దేశించి రాములు మాట్లాడుతూ, రిమ్స్ ఆసుపత్రి, కాలేజీల్లో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డులు, పారిశుధ్య కార్మికులు, పేషెంట్ కేర్ వర్కర్లు, ఇతర కేటగిరీలకు చెందిన కార్మికులు సమస్యలను పరిష్కరించాలని రిమ్స్ అధికారులను, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కు పలుమార్లు విన్నవించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ గత 15 సంవత్సరాలుగా పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగ, కార్మికులు చట్టబద్ధ హక్కులకు నోచుకోవడం లేదన్నారు. కనీస వేతనాలు, పీఎఫ్, ఇఎస్ఐ, ప్రసూతి సెలవులు ఇవ్వడం లేదన్నారు. పాత పనివేళల స్థానంలో కొత్త పనివేళలను తీసుకొచ్చిన కాంట్రాక్టర్లు, అధికారులు కార్మికులతో అదనంగా పని చేయించుకుంటూ శ్రమదోపిడీ చేస్తున్నారని విమర్శించారు. పాత పనివేళలనే కొనసాగిం చాలని, పీఎఫ్, ఇఎస్ఐ డబ్బులను కార్మికుల ఎకౌంట్లో జమ చేసి పేస్లిప్పులు అందజేయాలని, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని వంగూరు డిమాండ్ చేశారు.
సీఐటీయూ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి జాదవ్ రాజేందర్ మాట్లాడుతూ, జీ.వో.నెం.14 ప్రకారం తమకు రూ.12 వేలు వేతనం చెల్లించాలన్నారు. ఒక నెల పెండింగ్ వేతనం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. శానిటేషన్ కార్మికుల సీనియార్టీ ప్రకారం వారిని పేషెంట్కేర్లుగా నియమించాలని, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు 180 ఇవ్వాలని, కార్మికులను, ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ కె.రమేశ్రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. దాదాపు అరగంట సేపు కార్మిక నాయకులతో చర్చలు జరిపిన డీఎంఇ, పనివేళలను పాత పద్దతిలోనే అమలు చేసేలా చూస్తానని, పీఎఫ్, ఇఎస్ఐ డబ్బులు కార్మికుల ఖాతాలో జమ అయ్యేలా, ఇతర పెండింగ్ వేతనాలు చెల్లించేలా అధికారులకు ఆదేశాలు ఇస్తానని హామి ఇచ్చారు. కార్మికుల క్రమబద్దీకరణ, ఇతర సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తానని తెలిపారు. ార్యక్రమంలో శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకురాలు మీనా కుమారి, రిమ్స్ యూనియన్ అధ్యక్షులు అక్రమ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి ఆర్.సురేందర్ తదితరులు పాల్గొన్నారు.